Sunday, April 28, 2024

అసెంబ్లీ ఎన్నికల్లో డబ్బు వ్యాపారం అరికట్టాలి: ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఓటర్లకు నగదు పంపిణీ చేయకుండా చర్యలు తీసుకోవాలని ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక ప్రతినిధులు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్‌కు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల్లో ప్రజలు తమ ఓటును అమ్ముకోకుండా చైతన్యం కలిగించేందుకు, అదేవిధంగా రాజకీయ పార్టీలు డబ్బు, మద్యం ఇతర వస్తువులతో ప్రజలను ప్రలోభాలకు గురి చేయకుండా అడ్డుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో తమ వేదిక ద్వారా ప్రయత్నం చేస్తున్నామని, దీనికి ప్రభుత్వ యంత్రాంగం సహకరించాలని కోరారు.

ఈ సందర్భంగా సిఈఓ వికాస్ రాజ్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఎలాంటి అవకతవకలు, అక్రమాలు జరుగకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నామని, ఎక్కడైనా డబ్బు, మద్యం వంటివి పంపిణీ చేసినా, రవాణా చేసినా, ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే ఏ ఇతర పనులకు పాల్పడినా కఠినమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. జర్నలిస్టులుగా మీరు ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక ద్వారా ఎన్నికలు సజావుగా జరిగేందుకు తమకు సహకరించడం, ఓటర్లను చైతన్యవంతం చేయడం అభినందనీయని సిఈఓ వికాస్ రాజ్ ప్రశంసించారు.

అనంతరం వేదిక సభ్యులు మాట్లాడుతూ దేశంలో ముందు ముందు ఎన్నికలు డబ్బు చుట్టే తిరుగుతున్నాయని, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను అపహస్యం చేసే విధంగా ఓట్ల వ్యాపారం నడుస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలను చైతన్యవంతం చేసి ఎన్నికల్లో జరుగుతున్న అక్రమాలను అడ్డుకోకపోతే భవిష్యత్ తరాలకు, ప్రజాస్వామ్యానికి తీవ్ర నష్టం జరుగుతుందని అన్నారు. ఎన్నికల సందర్భంగా జరిగే అక్రమాలను ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సోషల్ మీడియా ద్వారా తమ దృష్టికి తీసుకురాచ్చని, లేదంటే ఎన్నికల కమీషన్ ఇచ్చిన సీ విజిల్, 1950 ఫోన్ నెంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఈకార్యక్రమంలో వేదిక నాయకులు మామిడి సోమయ్య, కే. కోటేశ్వరరావు, అనంచిన్ని వెంకటేశ్వరరావు, పులిపలుపుల ఆనందం, వెంకటేశ్వర్లు తదితరులు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వికాస్ రాజ్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.

డిజిపిని కలిసిన వేదిక ప్రతినిధులు:
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలను జరుగకుండా శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా గట్టి చర్యలు తీసుకోవాలని డిజిపి అంజనీ కుమార్‌ను కోరారు. ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక ద్వారా తాము ప్రజలను చైతన్యవంతం చేయడానికి చేస్తున్న కార్యక్రమాలకు పోలీసు యంత్రాంగం సహకరించాలని కోరారు. అందుకు డీజీపీ సానుకూలంగా స్పందించి వేదిక సభ్యులైన జర్నలిస్టు నేతలను అభినందించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News