తెలంగాణలో డయాలసిస్ పేషెంట్లకు కాంగ్రెస్ ప్రభుత్వం చేయూతగా నిలిచింది. ఒక్క నెలలోనే 4021 మంది లబ్దిదారులను ఎంపిక చేసి వారి జీవితాల్లో కొత్త ఆశల వెలుగు నింపుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. కొత్తగా మొత్తం 4,021 మంది డయాలసిస్ రోగులకు నెలకు రూ.2,016 చొప్పున పింఛన్ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇది గత ప్రభుత్వ పరిపాలనతో పోలిస్తే అధికంగా ఉంది. బీఆర్ఎస్ హయాంలో కేవలం 4,011 మంది డయాలసిస్ పేషెంట్లకే ఆసరా పింఛన్ అందగా, కొత్త ప్రభుత్వంలో ఒక్క నెలలోనే దాన్ని మించి లబ్ధిదారులు ఎంపిక కావడం గమనార్హం. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి సీతక్క చొరవతోనే నూతన లబ్ధిదారుల ఎంపిక జరిగింది.
ముఖ్యంగా డయాలసిస్ బాధితులు ఏ పనిచేయలేరు. ప్రతి నెల ఆసుపత్రిలో చికిత్స చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపధ్యంలో వారి కష్టాలను గుర్తించిన ప్రభుత్వం వారికి పింఛన్లు మంజూరు చేసింది. వీరితో పాటు త్వరలో హెచ్ఐవీ బాధితులకు కూడా పింఛన్లు మంజూరు చేయనున్నట్లు సమాచాకరం. ఇప్పటికే దాదాపు 13,000 మంది హెచ్ఐవీ పేషెంట్లు తమకు పెన్షన్లు మంజూరు చేయాలంటూ దరఖాస్తు చేసుకున్నారు. అన్ని రకాల నూతన పింఛన్ దారుల ఎంపిక కోసం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆర్థిక శాఖ అనుమతుల కోసం వేచి చూస్తోంది. అనుమతులు రాగనే మరింత మంది లబ్ధిదారులకు పింఛన్ అందే అవకాశం ఉంది. కొత్త పింఛన్ దారుల గుర్తింపుప్రక్రియ పూర్తయితే లబ్దిదారుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.