బాలసోర్ (ఒడిశా): ఒడిశా సముద్ర తీరం నుంచి బుధవారం మధ్యాహ్నం 3.35 గంటల ప్రాంతంలో మధ్యస్థ శ్రేణి ఉపరితల వాయు క్షిపణి (మీడియం రేంజి సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ ఎంఆర్ఎస్ఎఎమ్) ని విజయవంతంగా ప్రయోగించినట్టు రక్షణశాఖ వెల్లడించింది. ఇక్కడికి సమీపాన ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజి (ఐటిఆర్) నుంచి లాంచ్పాడ్ మీదుగా ఈ ప్రయోగం జరిగింది. మానవ రహిత విమానం ‘బన్షీ’ ని మొదట గగన తలం లోకి పంపిన తరువాత,దాన్ని క్షిపణి ఛేదించ గలిగేలా ప్రయోగం చేశారు. ఇజ్రాయెల్ ఎయిరోస్పేస్ ఇండస్ట్రీస్ సహకారంతో డిఆర్డివొ ఈ క్షిపణిని రూపొందించ గలిగింది. భారత్ డైనమిక్స్ దీన్ని తయారు చేసింది. భారత ఆర్మీలో ఇది చేరిన తరువాత శత్రు లక్షాల ఛేదనలో రక్షణ దళాలకు మరింత బలం చేకూరుతుంది. ఈ ప్రయోగానికి ముందు ప్రయోగ స్థావరానికి 2. 5 కిమీ పరిధిలో దాదాపు 8100 మందిని తాత్కాలికంగా ఖాళీ చేయించి సమీప రక్షణ కేంద్రాలకు తరలించారు.