బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా
సిలిగురి: పౌరసత్వ సవరణ చట్టం(సిఎఎ)ను త్వరలోనే అమలులోకి తెస్తామని బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా తెలిపారు. కరోనా మహమ్మారి వల్లే ఆలస్యమైందని ఆయన అన్నారు. బెంగాల్లోని అధికార పార్టీ టిఎంసివి విభజన రాజకీయాలని, తాము అందరి అభివృద్ధి కోసం పని చేస్తామని నడ్డా అన్నారు. ఉత్తర బెంగాల్లోని దళితులు, గూర్ఖాలు, రాజ్బన్షీలు, ఇతర గిరిజన వర్గాలతో నిర్వహించిన సమావేశంలో నడ్డా ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే సిఎఎ బిల్లు పార్లమెంట్లో పాసైందని, దాని ప్రయోజనాలు లబ్ధిదారులకు అందించేందుకు కట్టుబడి ఉన్నామని ఆయన తెలిపారు. సిఎఎకు సంబంధించిన నిబంధనలు రూపొందించే పని ప్రారంభమైందని ఆయన తెలిపారు. సిఎఎను త్వరలో అమలు చేయాలని పలువురు నడ్డాకు విజ్ఞప్తి చేశారు. తూర్పు పాకిస్థాన్ నుంచి వలస వచ్చిన శరణార్థులు ఉత్తర బెంగాల్లో పెద్ద సంఖ్యలో ఉన్నారని నడ్డాకు వారు గుర్తు చేశారు.