Sunday, June 16, 2024

ఎవరెస్ట్‌ని అధిరోహించిన 16 ఏళ్ల బాలిక కామ్య కార్తికేయన్

- Advertisement -
- Advertisement -

ముంబైకి చెందిన 16 ఏళ్ల బాలిక కామ్యకార్తికేయన్ విజయవంతంగా మౌంట్ ఎవరెస్ట్‌ని అధిరోహించి రికార్డు సృష్టించింది. నేపాల్ వైపు నుంచి ప్రపంచం లోనే అత్యంత ఎత్తైన శిఖరాన్ని అధిరోహించిన అతి చిన్న వయసు కలిగిన భారతీయురాలిగా ఈ ఘనత సాధించినట్టుగా టాటా స్టీల్ అడ్వంచర్ ఫౌండేషన్ (టిఎస్‌ఎఎఫ్) గురువారం తెలిపింది. ముంబై లోని నేవీ చిల్డ్రన్ స్కూల్‌లో 8 వ తరగతి చదువుతున్న కామ్య కార్తికేయన్, ఆమె తండ్రి నేవీ కమాండర్ అయిన కార్తికేయన్‌తో కలిసి ఏప్రిల్ 3న ఎవరెస్ట్ శిఖరాన్ని ( 8,849 మీటర్లు ) అధిరోహించేందుకు తమ యాత్రను ప్రారంభించినట్టు భారత నౌకాదళం తెలిపింది. మే 20న వారిద్దరూ ఎవరెస్ట్ శిఖరం అంచుకు చేరుకున్నారు. కామ్య కార్తికేయన్ ఘనతను ప్రశంసిస్తూ వెస్ట్రన్ నేవల్ కమాండ్ ఆమె చిత్రాన్ని ట్వీట్ చేసింది. “ ఈ ఫీట్ ద్వారా ఆమె ప్రపంచం లోనే రెండో అతిపిన్న వయస్కురాలు, మరియు నేపాల్ వైపు నుంచి ప్రపంచంలో ఎత్తైన శిఖరాన్ని అధిరోహించిన అతిపిన్న వయస్కురాలైన భారత పర్వతారోహకురాలు ” అంటూ ట్వీట్ చేసింది.

కామ్య కార్తికేయన్ ఆరు ఖండాల్లోని అత్యంత ఎత్తైన శిఖరాలను అధిరోహించింది. ఈ ఏడాది డిసెంబర్‌లో అంటార్కిటా లోని మౌంట్ విన్సన్ మాసిఫ్‌ను అధిరోహించాలని లక్షంగా పెట్టుకుంది. ‘ 7 సమ్మిట్స్ ఛాలెంజ్ ’ సాధించిన అతి పిన్న వయస్కురాలిగా నిలవడం ఆమె లక్షమని చెప్పింది. దీనికి ముందు 2020లో ఆసియా వెలుపల ఉన్న దక్షిణ అమెరికా లోని ఎత్తైన శిఖరం మౌంట్ అకాన్‌కాగువాను అధిరోహించిన ప్రపంచం లోని అతి పిన్న వయస్కురాలి రికార్డు కామ్య పేరుపై ఉంది. ఆమె హిమాలయ పర్వతారోహణ యాత్ర ఏడేళ్ల లోనే ప్రారంభమైంది.2015లో 12,000 అడుగుల ఎత్తున్న చంద్రశిల శిఖరాన్ని అధిరోహించింది. తరువాతి సంవత్సరం 13,500 అడుగులు ఎత్తైన హర్ కీ దున్ , 13,500 అడుగుల ఎత్తైన కేదార్‌కంథ శిఖరం, 16,400 అడుగుల ఎత్తైన రూప్‌కుంద్ సరస్సు శిఖరాలను అధిరోహించింది. ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల శక్తి పురస్కార్‌ను కూడా అందుకోగలిగింది. యువసాహసికులకు ఆమె స్ఫూర్తిప్రదాతని, తన స్వప్నాలను నెరవేర్చుకోగలిగే సాహసికురాలని టాటా స్టీల్ అడ్వంచర్ ఫౌండేషన్ ఛైర్మన్ చాణక్య చౌదరి ప్రశంసించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News