Thursday, May 2, 2024

విదేశీయులకు ఎవరెస్ట్ పర్వతారోహణ ఫీజు పెంచనున్న నేపాల్

- Advertisement -
- Advertisement -

కాట్మండు : ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించడానికి అనుమతి కోరే విదేశీ యాత్రికులకు రాయల్టీ ఫీజు 4000 డాలర్ల నుంచి 15000 డాలర్లకు పెంచడానికి యోచిస్తున్నట్టు నేపాల్ ప్రభుత్వం సోమవారం వెల్లడించింది. ఈ పెంపు 2025 నుంచి అమలు లోకి వస్తుందని ప్రకటించింది. ప్రపంచం మొత్తం మీద 8848.86 మీటర్ల ఎత్తులో ఉన్న ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడానికి విదేశీయాత్రికులు ప్రస్తుతం రాయల్టీ ఫీజు 11000 వరకు డాలర్లు చెల్లిస్తున్నారు. నేపాలీ పర్వతారోహకులైతే నేపాల్ రూపాయలు 75,000 చెల్లించాలి.

ప్రభుత్వం గతంలో 2015 జనవరిలో రాయల్టీ ఫీజును సవరించింది. అయితే ఇప్పుడు పెంచిన ఫీజు ప్రతిపాదన కేబినెట్ ఆమోదం పొందితే అమలు లోకి వస్తుందని టూరిజం విభాగం అధికార ప్రతినిధి యువరాజ్ ఖతివాడ వెల్లడించారు. 2015 కు ముందు బృందాల వారీ పర్వతారోహణకు గరిష్ఠంగా 15 మంది వరకు ఉంటే ఒక్కొక్కరు 10,000 వరకు డాలర్లు చెల్లించవలసి వచ్చేది. అయితే గ్రూపుల వారీ పద్ధతిని ఆపేశారు. ప్రతి విదేశీ పర్వతారోహకుడు 11,000 డాలర్లు చెల్లించేలా అమలు లోకి తెచ్చారు. అయితే ప్రభుత్వం మరో కొత్త నిబంధన అమలు లోకి తెస్తోంది. పర్వతారోహణలో ఎవరైనా చనిపోతే వారి మృతదేహాలను తిరిగి పర్వతాల నుంచి తప్పనిసరిగా తీసుకురావాలన్న నిబంధన విధిస్తున్నారు.

పర్వతాలపై చనిపోయేటప్పుడు ఆయా వ్యక్తులకు బీమా సౌకర్యం ఉన్నప్పటికీ మృతదేహాలను అక్కడనే విడిచిపెట్టేస్తున్నారు. ఎవరెస్ట్ పై ఇలాంటి విషాదకర సంఘటనలను దృష్టిలో పెట్టుకుని కొత్త నిబంధన అమలు లోకి తెస్తున్నారు. ఈ ఏడాది వ పర్వతారోహణ సీజన్‌లోనే నేపాల్ వైపు నుంచి పర్వతారోహణ చేసిన దాదాపు 17 మంది పర్వతారోహకులు చనిపోయారు. గతంలోసంభవించిన వైపరీత్యాల్లో ముఖ్యంగా 2014 ఏప్రిల్‌లో హిమపాతం సంభవించి 16 నేపాలీ షెర్పా గైడ్లు ప్రాణాలు కోల్పోయారు. తరువాతి సంవత్సరంలో నేపాల్‌లో భూకంపం సంభవించి ఎవరెస్ట్ శిఖర స్థావర శిబిరం వద్ద హిమపాతానికి దారి తీసి దాదాపు 20 మంది మృతి చెందారు. అత్యంత ఎత్తయిన పర్వత శిఖరాల నుంచి మృతదేహాలను కిందకు తీసుకురావడం అసాధారణ వాతావరణం వల్ల ఎంతోవ్యయప్రయాసలు, ప్రమాదం ఎదుర్కోవలసి వస్తోంది.

పర్వత శిఖరాల నుంచి ఒక మృతదేహాన్ని కిందకు తీసుకురాడానికి 20,000 డాలర్ల నుంచి 2,00,000 డాలర్ల వరకు ఖర్చు అవుతోందని కాఠ్మండ్ పోస్ట్ వార్తాపత్రిక కథనం చెబుతోంది. టూరిజం డిపార్టుమెంట్ లోని మౌంటెనీరింగ్ సెక్షన్ డైరెక్టర్ రాకేష్ గురుంగ్ ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని కూలీల, ఎత్తైన శిఖరాలకు చెందిన కార్మికులు, గైడ్లు బీమా, వేతనాలు, ఇతర సౌకర్యాలు కూడా పెంచుతున్నట్టు వెల్లడించారు. ఇదిలా ఉండగా, నేపాల్‌లో పర్వతారోహణలను నిర్వహించే విదేశీ సంస్థలు తమ ఆర్థిక లావాదేవీలు, వ్యాపారాలు అధికారికంగా నిర్వహించాల్సి ఉంటుందని చెప్పారు.

ప్రస్తుతం పర్వతారోహకుల నుంచి ఎంత చార్జి వసూలు చేస్తున్నారో ఆయా సంస్థలు రికార్డులు చూపడం లేదు. 2024లో చేపట్టనున్న పర్వతారోహణకు సంబంధించి కొన్ని ఏజెన్సీలు ఇప్పటికే బుకింగ్స్ చేశాయి. ఆయా ఏజెన్సీలకు తాము సమయం ఇస్తున్నామని దానివల్ల వారి వ్యాపారాలకు ఎలాంటి ఆటంకం కలగదని రిపోర్టు పేర్కొంది. ఈ పర్వతారోహణ సీజన్‌లో నేపాల్ ప్రభుత్వం ఒక్క ఎవరెస్ట్ శిఖరం నుంచే 5.08 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని పొందగలిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News