Wednesday, May 1, 2024

తరుముకొస్తున్న కొత్త వేరియంట్

- Advertisement -
- Advertisement -

దీపావళి వేళ కొత్త వేరియంట్ కలకలం
పలు రాష్ట్రాల్లో వెలుగుచూస్తున్న కేసులు
ఆందోళన వద్దు : డీహెచ్ శ్రీనివాసరావు
మనతెలంగాణ/హైదరాబాద్: దీపావళి పండుగ వేళ దేశంలో పలు రాష్ట్రాలలో కరోనా కొత్త వేరియంట్ కేసులు వెలుగుచూడటం కలకలం రేపుతోంది. బీఎఫ్.7 అనే వేరియంట్ కేసు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నమోదైంది. 60 ఏళ్ల వృద్ధుడికి ఈ ఇన్‌ఫెక్షన్ సోకిందని అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు. ఈ ఏడాది జులై 15.. రోగి శాంపిల్స్‌ను గాంధీనగర్‌లోని బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్‌కు పంపగా.. అక్టోబరు 17న నివేదిక వచ్చింది. అందులో రోగికి ఒమిక్రాన్ వేరియంట్ బీఎఫ్.7 సోకినట్లు నిర్ధరణ అయ్యిందని అధికారులు తెలిపారు. అతడితో సన్నిహితంగా ఉన్న 10 మందికి ఎటువంటి వ్యాధి లక్షణాలు లేవని పేర్కొన్నారు. దేశంలో పలు ప్రాంతాల్లో కొత్త వేరియంట్ కేసులు పెరిగిన నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ఇటీవల సమావేశం నిర్వహించారు. దేశంలో కొవిడ్ వ్యాప్తి తీరుపై చర్చించిన నిపుణులు.. దేశవ్యాప్తంగా మాస్కులు, కరోనా నిబంధనలు పాటించడాన్ని కొనసాగించాలని నిర్ణయించినట్లు ప్రభుత్వవర్గాలు వెల్లడించాయి. మహారాష్ట్రలో గతవారంలో నమోదైన కరోనా కేసుల్లో 17.7శాతం పెరుగుదల కనిపించింది. వీటిలో ఎక్కువగా ఒమిక్రాన్ ఉపరకమైన ఎక్స్‌బిబి ఉన్నట్లు నిపుణులు గుర్తించారు. ఇప్పటికే వ్యాప్తిలో ఉన్న బీఏ.2.75తో పోలిస్తే విస్తృత వేగంతో వ్యాప్తి చెందడంతోపాటు రోగనిరోధకతను తప్పించుకునే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఫ్లూ మాదిరి లక్షణాలు ఉంటే నిర్లక్ష్యం చేయవద్దని.. వెంటనే కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని మహారాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులు సూచించారు. అలాగే కేరళలో పలు చోట్ల ఈ వేరియంట్ కేసులు ఎక్కువగా నమోదవుతుండడం వల్ల అక్కడి ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. వైరస్‌లో మార్పులతో కొత్త రకాలు పుట్టుకొస్తున్నందున.. వైరస్ కట్టడి చర్యలు ముమ్మరం చేయాలని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ అధికారులను ఆదేశించారు.
బీఏ.2.75, బీజే.1 రకాలు కలిసి ఎక్స్‌బిబి సబ్ వేరియంట్‌గా ఏర్పడినట్లు వైద్య నిపుణులు వెల్లడించారు. దీనిని ఇప్పటికే మహారాష్ట్ర, బంగాల్, ఒడిశా, తమిళనాడులో గుర్తించారు. సింగపూర్, యూఎస్‌లలో కరోనా కేసుల పెరుగుదలకు ఈ రకమే కారణమని అంచనా వేస్తున్నారు. దీనికి బీఏ.2.75 కంటే వేగంగా వ్యాప్తి చెందే లక్షణం, రోగనిరోధక శక్తిని ఏమార్చే గుణం ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఎక్స్‌బిబితో పాటుగా మొదటిసారి మహారాష్ట్రలో బీఏ.2.3.20, బీక్యూ.1 రకాలనూ గుర్తించారు. దీపావళి పండుగల నేపథ్యంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
భయపడాల్సిన అవసరం లేదు : డీహెచ్ శ్రీనివాసరావు
కరోనా కొత్త వేరియంట్ గురించి భయపడాల్సిన అవసరం లేదని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు(డిహెచ్) డాక్టర్ జి.శ్రీనివాసరావు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు కొత్త వేరియంట్ కేసులు నమోదు కాలేదని, కొత్త వేరియంట్ పట్ల ఎలాంటి ఆందోళన వద్దని అన్నారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

New Covid BF.7 Variant spread in India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News