తిరస్కరణకు గురైన 1.18లక్షల దరఖాస్తులు పరిశీలన
40శాతం దరఖాస్తులు ఎంపిక కావచ్చని భావిస్తున్న పౌరసరఫరాల శాఖ
కొత్త ఏడాది జనవరిలో లబ్దిదారులకు సరుకులు పంపిణీ
కార్డుల ఎంపికలో రాజకీయ ఒత్తిడిలు లేకుండా చేస్తాంటున్న సిబ్బంది
మన తెలంగాణ,సిటీబ్యూరో: గ్రేటర్ నగరంలో కొత్త రేషన్కార్డులు మంజూరుకు అధికారులు గతంలో తిరస్కరణకు గురైన దరఖాసులను పరిశీలన చేయడంతో పేద ప్రజల్లో మళ్లీ ఆశలు చిగురుస్తున్నాయి. మూడు నెల కితం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసిన వాటిలో 30శాతం మాత్రమే రేషన్కార్డులు మంజూరు చేశారు. పౌరసరఫరాల అధికారులు 360డిగ్రీలో ఎంపిక చేయడంతో చాలా దరఖాస్తులను పక్కకు పెట్టారు. గత నెల రోజుల నుంచి స్దానిక ప్రజలు పర్యటనకు వచ్చే ఎమ్మెల్యేలను నిలదీస్తుండటంతో గతంలో సమర్పించిన దరఖాస్తులను మరోసారి పరిశీలన చేయాలని ప్రభుత్వానికి సూచనలు చేయడంతో ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు జిల్లా అధికారులు పాత దరఖాస్తులను క్షేత్రస్దాయి పరిశీలన చేస్తూ అర్హులను ఎంపిక చేసే పనిలో పడట్లు పేర్కొంటున్నారు.
2, 35, 675 కుటుంబాలు దరఖాస్తులు రాగా, వాటిలో 1,18లక్షలు వివిధ కారణాలతో దరఖాస్తులు తిరస్కరించబడ్డాయి. 60వేల దరఖాస్తులను అనర్హతగా గుర్తించారు. దీంతో కొత్త పెళ్లిన కుటుంబాలు, ప్రైవేటు ఉద్యోగులు, బలహీన వర్గాల కోటాలో ఇళ్లు పొందిన వారి దరఖాస్తులే ఎక్కువగా పెండింగ్లో పెట్టినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. మ్యుటేషన్ దరఖాస్తుల సంఖ్య లక్షకు పైగా ఉన్నట్లు చెబుతున్నారు. నాలుగేళ్ల కితం నుంచి సమర్పించిన దరఖాస్తులను పరిశీలిన చేస్తున్నామని, అప్పటి నుంచి ఎదురుచూస్తున్న వారికి ఈ విచారణలో ఎంపిక చేస్తామని, అవసరమైతే దరఖాస్తుదారుల ఇంటి వద్దకు పూర్తి ఆస్తుల వివరాలు పరిశీలించి అర్హులందరిని గుర్తిస్తామంటున్నారు. జిల్లా వారి దరఖాస్తుల వివరాలు హైదరాబాద్ జిల్లాలో 99,668 దరఖాస్తులు రాగా, 43, 604 తిరస్కరణ, రంగారెడ్డి జిల్లాలో 74,254 దరఖాస్తులు 38,766 తిరస్కరణ, మేడ్చల్ జిల్లాలో 61,773 దరఖాస్తులు రాగా 36,400లను పెండింగ్లో పెట్టారు. వీటిలో ప్రభుత్వ నిబంధనలు ప్రకారం దాదాపు 40శాతం దరఖాస్తులు ఎంపికయ్యే అవకాశముందని పౌరసరఫరాల అధికారులు భావిస్తున్నారు. పేద ప్రజలు రేషన్కార్డుల కోసం దళారులను ఆశ్రయించవద్దని, ఏదైనా సమస్య ఉంటే అధికారుల వద్దకు నేరుగా వచ్చి వివరించాలని సూచిస్తున్నారు.