రాష్ట్ర బిసి కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్
వైభవంగా మేరు కులస్తుల ఆత్మీయ సమ్మేళనం
మేరు ఫెడరేషన్ ఏర్పాటు చేయాలని మహాసభలో డిమాండ్
మనతెలంగాణ, హైదరాబాద్: బట్టలను కొలతలతో కుట్టి మానవ సమాజాన్ని సుందరంగా తీర్చిదిద్దిన మేరు, దర్జీల సేవలు వెలకట్టలేనివని రాష్ట్ర బిసి కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ అన్నారు. ఆదివారం నాంపల్లిలోని ఎగ్జిబిషన్ మైదానంలో దసరా, దీపావళి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. మేరు సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా పెద్దసంఖ్యలో కులస్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా వకుళాభరణం కృష్ణమోహన్ మాట్లాడుతూ మేరు కులస్తుల నిపుణత, కృషి మరువలేనివవన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని మేరు కులస్తులు అభివృద్ధిలోకి రావాలన్నారు. బిసిలోని అన్ని కులాలపై సమగ్రంగా అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. మేరు సంఘం తన దృష్టికి తెచ్చిన అంశాలపై పరిశీలన చేసి ఆ వర్గాల సమున్నతికి దోహదం చేసేలా ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. బిసి డి గ్రూప్ నుంచి ఏ గ్రూప్లోని మార్చాలని, మేరు ఫెడరేషన్ ఏర్పాటు చేయాలని సమ్మేళనంలో కులస్తులు డిమాండ్ చేశారు. రాష్ట్ర మేరు సంఘం అధ్యక్షుడు కీర్తి ప్రభాకర్ సమ్మేళానికి అధ్యక్షత వహించారు. సమ్మేళనంలో శాసనసభ్యుడు ముఠా గోపాల్, దర్శకుడు ఎన్.శంకర్, వి6 తీన్మార్ శిరీష, జబర్థస్త్ వాడపల్లి కార్తీక్లు పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో కె.భాస్కర్రావు, నర్సింగ్రావు, పెండ్యాల చంద్రమోహన్, సతీష్కుమార్, దీక్కొండ నర్సింగ్రావు ఉన్నారు.