Monday, May 13, 2024

న్యూస్‌క్లిక్ వివాదం.. అమెరికన్ మిలియనీర్‌కు ఈడీ సమన్లు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: భారత్‌కు చెందిన ఆన్‌లైన్ వార్తల పోర్టల్ న్యూస్‌క్లిక్ కేసులో అమెరికా మిలియనీర్ నెవిల్లే రాయ్ సింగం కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సమన్లు జారీ చేసింది. చైనాకు అనుకూలంగా కథనాలు రాసేందుకు న్యూస్‌క్లిక్‌కు బీజింగ్ నుంచి నిధులు అందుతున్నాయని ఈ ఏడాది ఆగస్టులో అమెరికా పత్రికలు కథనాలు వెలువరించాయి. నెవిల్లే రాయ్ సింగం, ఆయనకు చెందిన న్యూస్ క్లిక్ ప్రమాదకరమైనవి అందులో అభివర్ణించాయి. దీనిపై కేసు నమోదు చేసి సోదాలు చేపట్టిన ఈడీ కొన్ని ఆస్తులను జప్తు చేసింది.

తాజాగా మనీలాండరింగ్ చట్టం కింద భారత విదేశాంగశాఖ ద్వారా చైనా లోని షాంఘైలో ఉన్న నెవిల్లే రాయ్ సింగంకు నోటీసులు పంపింది. ఆయన వాదనలు రికార్డు చేసేందుకు ఢిల్లీ కోర్టు అనుమతించిన నేపథ్యంలో ఈడీ రెండోసారి సమన్లు జారీ చేసింది. న్యూస్‌క్లిక్ వివాదంలో తనపై వచ్చిన ఆరోపణలను నెవిల్లే ఇప్పటికే ఖండించారు. చైనా నుంచి నిధులు అందుతున్నాయనే ఆరోపణలతో 2021 సెప్టెంబరులో ఢిల్లీలోని న్యూస్‌క్లిక్ కార్యాలయంలో ఈడీ సోదాలు చేసింది.

అనంతరం న్యూస్‌క్లిక్ ఎడిటర్ ఇన్‌చీఫ్ ప్రబీర్ పురకాయస్థ సహా 25 మంది వాంగ్మూలాన్ని నమోదు చేసింది. రెండు నెలల క్రితం ఈడీ ఇచ్చిన సమాచారంతో ఢిల్లీ పోలీసులు ఉగ్రవాద వ్యతిరేక చట్టం ఉపా కింద కేసు నమోదు చేశారు. అనంతరం ప్రబీర్‌ను అరెస్టు చేశారు. విదేశీ నియంత్రణ చట్టం (ఎఫ్‌సిఆర్‌ఎ) నిబంధనలను ఉల్లంఘించిందని సిబీఐ కేసు నమోదు చేసి ప్రబీర్ నివాసం, కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించి ఆస్తులను జప్తు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News