Tuesday, April 30, 2024

స్వాతంత్య్రోద్యమానికి దశ, దిశ పత్రికలే

- Advertisement -
- Advertisement -

బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్య్ర పోరాటం పలు విధాలుగా జరిగింది. ప్రజలు తమ ప్రాంత, వర్గ, కులాలకు అతీతంగా అన్ని హద్దులను దాటి పోరాటం చేశారు. ఈ పోరాటంలో సమాజంలోని ఇతర ప్రతినిధులు, మేధావులతో కలసి జర్నలిస్టులు పాల్గొన్నారు. బ్రిటన్ ప్రభుత్వ దోపిడీని, అన్యాయ మార్గాలను ఎండగడుతూ దేశం యావత్తూ ఒకతాటిపై నిలిచేలా కృషి చేశారు. నాటి జర్నలిస్టులు తమ రచనలతో సమాజంలోని చెడుపై పోరాటం చేస్తూనే బ్రిటిష్ బానిస పాలనకు వ్యతిరేకంగా రచనలు చేసి ప్రజల్లో తగిన స్ఫూర్తితో స్వాతంత్య్ర పోరాటానికి జాతీయోద్యమ రూపులిచ్చి, ఉద్యమ లక్ష్యం పక్కదారి పట్టకుండా దిశానిర్దేశం చేసింది పత్రికలే.

పురాణాలు, ఇతిహాసాల వల్ల సాధ్యం కాని జాతి ఏకీకరణ పత్రికల ద్వారానే సాధ్యమైందని, కేవలం స్వాతంత్య్ర సాధన ఏకైక లక్ష్యంతో, స్వాతంత్య్ర ఉద్యమ ప్రచారానికి ఆవిర్భవించిన అనేక పత్రికల ద్వారా స్వాతంత్య్ర సాధన కాసింత సులభమైంది. సాంకేతికత ఏమాత్రం లేని ఆరోజుల్లో పత్రికలు లేకుంటే స్వాతంత్య్ర సాధన మరికొన్ని దశాబ్దాల పాటు ఆలస్యమయ్యేదని నాటి ఉద్యకారులు అభిప్రాయపడ్డారు. దేశం కోసం ఆవిర్భవించిన పత్రికల్లో పని చేసిన జర్నలిస్టులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా బ్రిటిష్ వారి నిర్బంధాల మధ్య ఉద్యమ గమనాన్ని, స్థితిగతులను ప్రజలకు నిర్భయంగా తెలియజేశారు. కేవలం దేశభక్తిని ప్రచారం చేయడం కోసమే ఆనాడు అనేక పత్రికలు ఆవిర్భవించాయి. దేశ ప్రజలను, కుటుంబ సభ్యుల మార్చి స్వాతంత్య్ర ఉద్యమంలో భాగస్వాములను చేసిన ఘనత ఆనాటి పత్రికలకే దక్కుతుంది.

గతంలో దేశ ప్రయోజనాలే పరమావధిగా పని చేసిన పత్రికలు ప్రస్తుతం తాము అవలంబిస్తున్న ధోరణిపై తులనాత్మక సమీక్ష చేసుకోవాలి. స్వాతంత్ర ఉద్యమ సమయంలోని తెలుగు పత్రికల ద్వారా దేశానికి ఎన్‌జి రంగ, తెన్నేటి విశ్వనాథం, బెజవాడ గోపాల్‌రెడ్డి వంటి మహోన్నత నాయకులు దొరికారు. మానవ జీవన పరిణామక్రమాన్ని సవ్య దిశలో నడిపి ఆలోచనల మథనానికి వేదికగా నిలిచి అనేక సామాజిక, శాస్త్రీయ ఆవిష్కరణలకు పత్రికలు వేదికలుగా నిలిచాయి. నాడు జర్నలిస్టుల లక్ష్యం ఏదంటే సామాజిక సంస్కరణల్లో, జాతీయ ఉద్యమంలో ప్రజలు భాగమయ్యేలా చూడడమే. ఆ రోజుల్లో వార్తా పత్రికను ప్రచురించడమంటే చాలా ధైర్యమైన పని, ఎందుకంటే అందులో ప్రచురితమైన అంశాలు తమకు వ్యతిరేకంగా వున్నాయని బ్రిటిష్ పాలకులు భావిస్తే జర్నలిస్టులు, ప్రచురణకర్తలపై ఉక్కుపాదం మోపేవారు.

స్వాతంత్య్ర పోరాటంలో వార్తా పత్రికలను శక్తివంతమైన ఆయుధాలుగా పరిగణించేవారు. బ్రిటీష్ సామ్రాజ్యవాద పాలకులకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా పౌరులను ఐక్యం చేయడమనే గర్వకారణమైన సంప్రదాయాన్ని వార్తా పత్రికలు, మ్యాగజైన్లు నెలకొల్పాయి. బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా విల్లమ్ములు, కత్తులు ఎక్కుపెట్టాల్సిన అవసరం లేదని, బ్రిటన్ సిపాయిల ఫిరంగులకు వ్యతిరేకంగా వార్తా పత్రికను బయటకు తీయండి అని నాడు అనేవారు. ఈ మాటలు వార్తాపత్రికల బలాన్ని సూచిస్తున్నాయి.

ఎంతోమంది జర్నలిస్టులు జర్నలిజం ద్వారా స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొంటూ దేశ సేవ చేశారు. స్వాతంత్య్ర పోరాట యోధులు దాదాపుగా ప్రతి ఒక ప్రముఖులు తమ రచనల ద్వారా ప్రజల్లో చైతన్యం నింపారు. నేటి ప్రపంచంలో జర్నలిజం పరిధి నాటకీయంగా విస్తరించింది. అంతే కాకుండా దాని బాధ్యతలు కూడా పెరిగాయి. అందుకే దేశ ప్రగతి జర్నలిజం ద్వారా జరగాలని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేకున్న నేటితరం జర్నలిస్టులకు తప్పనిసరిగా తెలియజేయాలి. జర్నలిజం సవ్యంగా ఉంటేనే ప్రభుత్వాలు చేస్తున్న పనులు ప్రజల్లోకి చేరుతాయి. అలాగే మాయకులకు వారు చేసిన వాగ్దానాలు గుర్తుచేసిన వారవుతారు.

ఈదునూరి మహేష్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News