Monday, May 6, 2024

కెసిఆర్ బాటలో నితీశ్

- Advertisement -
- Advertisement -

కేంద్రంలోని నియంతృత్వ బిజెపి ప్రభుత్వంపై రణన్నినాదం
పొత్తుకు మంగళం.. విపక్షంతో స్నేహ ప్రతిపక్షానికి అదనపు బలం

బీహార్‌లో గత రెండు రోజులగా శరవేగంగా చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు బిజెపికి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో అలుపెరగని పోరాటం చేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాజకీయ వైఖరికి మరింత బలం చేకూర్చాయి. నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నియంతృత్వ పోకడతో విపక్ష పార్టీలను నాశనం చేయడానికి ప్రయత్నిస్తోందని, బిజెపిని గద్ద్దె దించితే తప్ప దేశంలో సమాఖ్య స్ఫూర్తి, ప్రజాస్వామ్యం మనుగడ సాగించే అవకాశం లేదని కెసిఆర్ గత కొంత కాలంగా ఎలుగెత్తుతున్న విషయం తెలిసిందే. ఢిల్లీ స్థాయిలో భావసారూప్యం కలిగిన రాజకీయ పార్టీలన్నిటినీ ఒక్క తాటిపైకి తెచ్చి బిజెపికి వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు ఆయన వ్యూహరచనలో నిమగ్నమై ఉన్నారు కూడా.

ఈ తరుణంలో బీహార్‌లో ఇంతకాలంగా బిజెపితో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని సాగిస్తున్న జెడి(యు) అధినేత నితీశ్ కుమార్ ఒక్క సారిగా బిజెపితో చెలిమికి గుడ్‌బై చెప్పి ఎన్‌డిఎతో తెగతెంపులు చేసుకున్నారు. నేత తేజస్వి యాద వ్, కాంగ్రెస్, మరో నాలుగు పార్టీలతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుండడం జాతీయ స్థాయిలో తనకు ఎదురులేదన్న రీతిలో ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న ఒక్కో రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలదోస్తూ వస్తున్న భారతీయ జనతా పార్టీకి కచ్చితంగా గట్టి ఎదురుదెబ్బేనని చె ప్పవచ్చు. 243మంది సభ్యులున్న బీహార్ అసెంబ్లీలో ఈ కొత్త కూటమికి 160 మంది సభ్యుల బలం ఉంది. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత నితీశ్ కొంతకాలమే ముఖ్యమంత్రిగా ఉంటారని, అనంతరం పగ్గాలు తేజస్వికి అప్పగిస్తారని విశ్వసనీయ సమాచారం. నితీశ్ ఆ లోచనలు 2024 సార్వత్రిక ఎన్నికలపై ఉండడమే దీనికి కారణమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. విపక్షాల ప్రధాని అభ్యర్థిగా నితీశ్ బరిలోకి దిగుతారని అప్పుడే ప్రచారం మొదలైంది కూడా. బిజెపికి వ్యతిరేకంగా రాజకీయ పోరాటానికి సిద్ధమయిన కెసిఆర్‌కు నితీశ్ నిర్ణయం ఎంతో బలం చేకూరుస్తుంది. 2024 ఎన్నికల్లో విజయం సాధించి కేంద్రంలో హ్యాట్రిక్ కొట్టాలని కలలు కంటున్న కమలనాథులకు నితీశ్ ఒక్కసారిగా మద్దతు ఉపసంహరించుకుని ప్రకంపనలు సృష్టించారు.

కేంద్రమంత్రివర్గంలో జెడి(యు) ఏకైక ప్రతినిధిగా ఉన్న ఆర్‌సిపి సింగ్ కేబినెట్‌నుంచి నిష్క్రమించడం బీహార్‌లో కల్లోలానికి ఒక కారణంగా చెబుతున్నారు. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సింగ్ గత కొంతకాలంగా నితీశ్‌కు బద్ధ శత్రువుగా ఉంటున్నారు. ఈ కారణంగా నితీశ్ ఆయనకు మరోసారి రాజ్యసభ అవకాశం కల్పించలేదు. దీంతో ఆయన జెడి(యు)కు రాజీనామా చేసి బిజెపిలో చేరిపోయారు. మరో వైపు జెడి(యు)కు కేబినెట్‌లో ప్రాతినిధ్యం పెంచడానికి కమలనాథులు ఇష్టపడడం లేదు. అంతేకాదు పేరుకు నితీశ్ బీహార్ ముఖ్యమంత్రి అయినా ఆయన తీసుకునే ఏ నిర్ణయం కూడా అమలు కాకుండా బిజెపి మోకాలడ్డుతూ వస్తుండడం కూడా ఆయన బిజెపికి దూరం కావడానికి మరో కారణం. తనను బలహీనుడిగా చేయడానికి బిజెపి ప్రయత్నిస్తోందని, తద్వారా 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత బీహార్‌లో అధికారం దక్కించుకోవాలని బిజెపి ప్రయత్నిస్తోందని నితీశ్ భావిస్తున్నారు.

మహారాష్ట్రలో ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలో మహా వికాస్ అఘాడి ప్రభుత్వాన్ని కూల్చడానికి బిజెపి ఆడిన నాటకం కూడా నితీశ్ అనుమానాలకు మరింత బలం చూకూర్చింది. నిజానికి 2025 లో నితీశ్ నాయకత్వంలోనే బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు వెళతామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల ప్రకటించారు.గత అసెంబ్లీ ఎన్నికల్లో జెడి(యు)కు తమకన్నా తక్కువ సీట్లు వచ్చినా నితీశ్‌నే ముఖ్యమంత్రిని చేసిన కమలనాథులు నితీశ్ చర్యతో బిత్తరపోయారు. మహారాష్ట్ర పరిణామాలతో కుదేలయిన ప్రతిపక్ష పార్టీలకు ఇప్పుడు బీహార్ పరిణామాలు మోడీపై యుద్ధానికి కొత్త అస్త్రశస్త్రాలను సమకూర్చినట్లయింది. రా బోయే రోజుల్లో కేంద్రంలోని మోడీ ప్రభుత్వంపై విపక్షాల దాడి మరింత తీవ్రం కావడం ఖాయం. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఢిల్లీ రాజకీయాల్లో మరింత కీలకపాత్ర పోషించే అవకాశం ఉంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News