Sunday, April 28, 2024

ప్రతిపక్ష నేతలతో భేటీ కోసం 5న ఢిల్లీకి నితీశ్‌కుమార్

- Advertisement -
- Advertisement -

Nitish Kumar to visit Delhi

పాట్నా: 2024 లోక్‌సభ ఎన్నికల్లో బిజెపికి వ్యతిరేకంగా పోరాడేందుకు ప్రతిపక్షాలను ఒక్క తాటిపైకి తెచ్చే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో సహా ప్రతిపక్ష నాయకులను కలుసుకునేందుకు బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఈనెల 5న ఢిల్లీ వెళ్లవచ్చని తెలుస్తోంది. తన పర్యటనలో నితీశ్ ఢిల్లీ ముఖ్యమంత్రి , ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రివాల్, వామపక్ష నేతలను కూడా కలుసుకుంటారని జెడి( యు) వర్గాలు తెలిపాయి. జెడి(యు) శని, ఆదివారాల్లో పార్టీ జాతీయ కార్యవర్గం, నేషనల్ కౌన్సిల్ సమావేశాలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. 2024లో జరిగే లోక్‌సభ ఎనికల్లో ప్రతిపక్ష నేతలను ఒకే వేదికపైకి తెచ్చేందుకు వారితో చర్చలు జరిపేందుకు జెడి(యు)ఈ సమావేశాల్లో నితీశ్ కుమార్‌కు అధికారం ఇచ్చే అవకాశం ఉంది.

బిజెపితో సంబంధాలు తెగతెంపులు చేసుకుని బీహార్‌లో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆర్‌జెడి కాంగ్రెస్‌వామపక్షాల కూటమితో చేతులు కలిపిన తర్వాత నితీశ్ ఢిల్లీలో పర్యటించడం ఇదే మొదటిసారి. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్షాల ఉమ్మడి ప్రధాని అభ్యర్థిగా ఉండబోతున్నారా అన్న మీడియా ప్రశ్నలకు నితీశ్ నేరుగా సమాధానం చెప్పనప్పటికీ సుదీర్ఘకాలం బీహార్ ముఖ్యమంత్రిగా పని చేసిన ఆయన జాతీయ స్థాయిలో ప్రధాన పాత్ర పోషించే అవకాశం ఉందంటూ పార్టీలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. రెండు రోజుల పాటు సాగే పార్టీ సమావేశాల వేదిక వద్ద ఏర్పాటు చేసిన కటౌట్లలో ప్రధాని నరేంద్ర మోడీని నేరుగా ఢీకొనబోయే నేతగా నితీశ్‌ను అభివర్ణిస్తూ నినాదాలు ప్రత్యక్షం కావడం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News