సీనియర్లపై సల్మాన్ ఖుర్షీద్ ఆగ్రహం
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీలో సోనియా, రాహుల్ల పట్ల ఉన్న మద్దతు గుడ్డివారు తప్ప మిగిలిన వారందరికీ సుస్పష్టం అని సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ చెప్పారు. పార్టీలో ఎటువంటి నాయకత్వ సంక్షోభం లేదని తేల్చిచెప్పారు. అంతటా పార్టీలో సోనియా, రాహుల్లకు మద్దతు ఉందని, ఇందులో ఎటువంటి అపనమ్మకాల ప్రసక్తేలేదన్నారు. గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా ఖుర్షీద్కు పేరుంది. పార్టీ అంతర్గత విషయాలపై బహిరంగంగా మాట్లాడటం ఇబ్బందికర పరిణామం అవుతుందని కపిల్ సిబల్ ఇతర నేతల విమర్శలపై ఈ సీనియర్ నేత స్పందించారు. నాయకత్వం అందరి మాటా వింటుందని , అవకాశం దక్కింది కదా అని మీడియాలో విమర్శలకు దిగడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు.
బీహార్ ఎన్నికలలో పార్టీ పేలవ ప్రదర్శన వ్యక్తం అయిందని సిబల్, చిదంబరం పేర్కొన్న అంశాలను ప్రస్తావిస్తూ వారు చెప్పిన దానితో తాను విభేధించడం లేదని అయితే వారు అంతర్గత విషయాన్ని బయటకు వెళ్లి చెప్పడం వల్ల తలెత్తే పరిణామాలను గుర్తించారా? అని ప్రశ్నించారు. విశ్లేషణలు జరగాల్సిందే. అయితే దీనికి సరైన వేదికలను ఎంచుకోవల్సి ఉంటుందని తోటి సీనియర్లకు ఖుర్షీద్ చురకలు పెట్టారు. పార్టీకి పూర్తి స్థాయి నాయకత్వం అవసరం అనే డిమాండ్ను ఖుర్షీద్ ప్రస్తావిస్తూ ఎవరైనా ఏ విషయంపై అయినా పార్టీలో అంతర్గతంగా చెప్పాల్సి ఉంటుందని, అప్పుడు సమగ్రరీతిలో విశ్లేషణలకు వీలేర్పడుతుందని తేల్చిచెప్పారు.
ఏడాది పై నుంచి సోనియానే తాత్కాలిక అధ్యక్షురాలిగా ఉంటూ వస్తున్నారనే విమర్శలను ఆయన తిప్పికొట్టారు. ఈ బాధ్యతల్లోని వారు ఎంతకాలం ఉండవచ్చు అనేది ఎవరికి వారుగా నిర్ణయించుకోవడం కుదరదని, నూతన నాయకత్వ ఖరారుకు సహజంగానే సమయం పట్టవచ్చు అని, అయినా ఏడాది అంతకు మించి అనేది ఎక్కువ కాలం కిందికి వస్తుందా? అని ప్రశ్నించారు. సముచిత కారణాలతోనే కొత్త నాయకత్వ ఖరారులో జాప్యం జరుగుతూ వస్తోందని అనుకోవచ్చు కదా? అని విమర్శకులపై ఖుర్షీద్ ఆగ్రహం వ్యక్తం చేశారు.