బెంగళూరు: ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్లో ఏ స్థానంలోనైన ఆడేందుకు సిద్ధంగా ఉన్నానని టీమిండియా స్టార్ బ్యాట్స్మన్ రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. జట్టు యాజమాన్యం ఏ స్థానంలో ఆడమని కోరితే ఆ స్థానంలో బ్యాటింగ్ చేసేందుకు ఇబ్బందేమి లేదన్నాడు. జట్టు అవసరాలకు అనుగుణంగా వ్యవహరించడమే తన లక్షమన్నాడు. దీని కోసం ఓపెనింగ్తో సహా దేనికైన తాను సిద్ధంగా ఉన్నానని తెలిపాడు. ప్రస్తుతం తాను ఫిట్నెస్పై దృష్టి సారించానన్నాడు. త్వరలోనే పూర్తి ఫిట్నెస్ సాధిస్తాననే నమ్మకాన్ని వ్యక్తం చేశాడు. అయితే ఆస్ట్రేలియా సిరీస్కు ఎంపిక విషయంలో కొందరూ తనపై పనిగట్టుకుని దుష్ప్రచారం చేయడం బాధగా ఉందన్నాడు. తాను ఫిట్గానే ఉన్నా కోహ్లితో విభేదాల కారణంగా జట్టుకు ఎంపిక చేయలేదని వస్తున్న వార్తల్లో నిజం లేదన్నాడు. పూర్తి ఫిట్నెస్తో లేని విషయం వాస్తవమేనని, అయితే టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు దాన్ని సాధిస్తాననే నమ్మకం తనకుందన్నాడు.
ఫిట్నెస్ను మెరుగు పరుచుకోవాలనే ఉద్దేశంతోనే జాతీయ క్రికెట్ అకాడమీకి వచ్చానని రోహిత్ వివరించాడు. ఇదిలావుండగా ఐపిఎల్తో పోల్చితే ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్ చాలా భిన్నమైందన్నాడు. ఐపిఎల్లో రాణించినా విఫలమైనా పెద్దగా ప్రభావం చూపదన్నాడు. అయితే క్లిష్టమైన ఆస్ట్రేలియా వంటి సిరీస్లలో రాణించాల్సిన బాధ్యత ప్రతి క్రికెటర్పై ఉంటుందన్నాడు. దేశానికి విజయం అందించడంలో ఉండే మజా మరేదాంట్లో ఉండదన్నాడు. మరోవైపు సుదీర్ఘ విరామం తర్వాత భారత్ అంతర్జాతీయ సిరీస్లో బరిలోకి దిగుతుందని, దీంతో ఇది క్రికెటర్లకు పరీక్షలాంటిదేనని రోహిత్ అభిప్రాయపడ్డాడు. ఓ ప్రముఖ వార్త సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూలో రోహిత్ ఈ విషయాలు వెల్లడించాడు.