సియోల్: దక్షిణ కొరియాతో యుద్ధానికి ఉత్తర కొరియా మళ్లీ కాలు దువ్వుతోంది. అంతర్ కొరియా శాంతి ఒప్పందాల కింద రెండు దేశాల సరిహద్దుల వద్ద ఏర్పడిన నిస్సైనిక(సైనికులను విరమించుకున్న) ప్రాంతాలలోకి మళ్లీ చొరబడతామని ఉత్తర కొరియా సైన్యం మంగళవారం ప్రకటించింది. అమెరికా ప్రభుత్వంతో అణ్వస్త్ర చర్చలలో ప్రతిష్టంభన ఏర్పడిన దరిమిలా ప్రత్యర్థి దక్షిణ కొరియాపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఉత్తర కొరియా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. దక్షిణ కొరియాతో కుదుర్చుకున్న ఒప్పందాల కింద ప్రకటించిన నిస్సైనిక సరిహద్దు ప్రాంతాలలోకి ప్రవేశించాలన్న అధికార పార్టీ సిఫార్సును సమీక్షిస్తున్నామని ఉత్తర కొరియా పీపుల్స్ ఆర్మీ జనరల్ స్టాఫ్ ప్రకటించింది.
ప్రస్తుత పరిస్థితిలో ఉభయ కొరియా దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా దిగజారిపోతున్నాయని, ఈ పరిస్థితులలో అధికార పార్టీ, ప్రభుత్వ ఆదేశాల మేరకు సైనికపరమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధమని జనరల్ స్టాఫ్ వెల్లడించింది. కాగా, సరిహద్దు పట్టణమైన కీసాంగ్లో ఏర్పాటు చేసిన అంతర్ కొరియా ఉమ్మడి కార్యాలయాన్ని ధ్వంసం చేస్తామని కొద్ది రోజుల క్రితమే ఉత్తర కొరియా నాయకుడు కిమ్ సోదరి కిమ్ జాంగ్ ఉన్ ప్రకటించారు. శత్రువైన దక్షిణ కొరియాపై ప్రతీకారం తీర్చుకునే విషయాన్ని సైన్యానికే వదిలిపెడతామని ఆమె తెలిపారు.