Monday, May 6, 2024

తెరపైకి ఓటుకు నోటు కేసు

- Advertisement -
- Advertisement -

4న సుప్రీంకోర్టులో విచారణ
చంద్రబాబుకు బిగుస్తోన్న ఉచ్చు…!?

మన తెలంగాణ/హైదరాబాద్ : 2014 తర్వాత తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఓటుకు నోటు కేసులో కదలిక వచ్చింది. ఈ నెల 4న సుప్రీం కోర్టు ఈ పిటిషన్ ను విచారణ చేయనుంది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబును కూడా ముద్దాయిగా చేర్చాలని వైసిపి ఎంఎల్‌ఎ ఆళ్ల రామక్రిష్ణా రెడ్డి (ఆర్కే) సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అంతేకాదు తెలంగాణ ఎసిబి నుంచి ఓటుకు నోటు కేసును సిబిఐకి బదిలీ చేయాలంటూ మరో పిటిషన్ వేశారు. 2017లో ఈ పిటిషన్లను ఆర్కే దాఖలు చేయగా ఈ నెల 4న లిస్టయింది.

అయితే అంతకు ముందు రోజే చంద్రబాబు స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసు విచారణ జరగనుంది. అది జరిగిన తర్వాతి రోజే ఓటుకు నోటు కేసు విచారణకు వస్తుండటం సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఈ కేసును సుప్రీంకోర్టులో జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ సుందరేష్ ధర్మాసనం దగ్గర ఓటుకు నోటు కేసును విచారించనుంది. గతంలో మొత్తం రేవంత్ రెడ్డి చుట్టే తిరిగిన ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పాత్రపైన ఎంఎల్‌ఎ ఆర్కే సుప్రీం కోర్టును ఆశ్రయించటం ఇప్పుడు సంచలనంగా మారింది. 2015లో తెలంగా ణలో ఎంఎల్‌సి ఎన్నికల సందర్భంగా ఓటుకు నోటు కేసు వెలుగులోకి వచ్చిన విషయం విదితమే. ఎంఎల్‌సి ఎన్నిక కోసం టిడిపికి మద్దతు తెలపాలంటూ నామినేటెడ్ ఎంఎల్‌ఎ స్టీఫెన్‌సన్ మద్దతును ప్రస్తుత పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కోరే సందర్భంలో సూట్‌కేసులతో 50 లక్షలు ఇస్తూ కెమెరాకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కారు. ఆ డబ్బులు ఇచ్చింది చంద్రబాబేనని ఎంఎల్‌ఎ ఆర్కే ఆరోపిస్తూ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ కేసులో రేవంత్‌ను ఎసిబి అధికారులు అరెస్ట్ చేసిన విషయం విదితమే. ఆ సమయంలో స్టీఫెన్‌సన్‌ను రేవంత్ రెడ్డి కలిసి డబ్బులు ఇస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అయ్యాయి. ఈ కేసులో రేవంత్ రెడ్డి కొన్నాళ్ల పాటు జైలు శిక్షను కూడా అనుభవించారు. ఆ తర్వాత బెయిల్ మీద బయటకు రాగా తర్వాత పరిణామాలతో ఈ కేసు కాస్త మరుగున పడిపోయింది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పాత్రపై విచారణ జరపాలని ఎసిబి ఏసీబీ కోర్టు ఆదేశించగా హైకోర్టు స్టే విధించింది. కాగా హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

ఈ కేసు హైకోర్టులో విచారణలో ఉన్నందున తాము జోక్యం చేసుకోబోమని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ కేసులో చంద్రబాబుకు సంబంధం కూడ ఉందని అప్పట్లో బిఆర్‌ఎస్ నేతలు ఆరోపించారు. అయితే ఈ కేసు విషయమై 2021 మే 27న ఇడి దాఖలు చేసిన చార్జీషీట్‌లో చంద్రబాబు పేరు లేదు. అయితే మరోసారి ఈ కేసు తెరపైకి రావటం స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టై జైల్లో ఉన్న సందర్భంలో ఈ కేసుపై విచారణ జరగనుండటం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రాజకీయంగా సంచలనంతో పాటు తీవ్రస్థాయిలో ఉత్కంఠను రేపుతోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News