Saturday, April 27, 2024

వర్గీకరణపై మోడీ హామీ అమలయ్యేనా?

- Advertisement -
- Advertisement -

ఎస్‌సి ఎ, బి, సి, డి వర్గీకరణ పోరాటం మొదలై మూడు దశాబ్దాలు అవుతున్నది. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో 1994లో 20 మంది మాదిగ యువకులతో వ్యవస్థాపక అధ్యక్షులుగా మందకృష్ణ మాదిగ నాయకత్వాన ఎంఆర్‌పి ఎస్ ఉద్యమం పురుడు పోసుకున్నది. తూర్పున పొడుస్తున్న సూర్యునివలే మాదిగ పల్లెలకు, అణగారిన వర్గాల పల్లెల్లో వెలుగులు నింపడానికి రాజ్యాంగ పరంగా రావలసిన హక్కులు సాధించుకునే దిశగా మాదిగ డప్పుపై చిర్రా చిటికెన పుల్లతో దరువేస్తూ దండోరా మోగిస్తూ దళిత ఉద్యమం తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. మూడు దశాబ్దాలుగా తెలుగు రాష్ట్రాల్లోనేకాక దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో వున్న ఎస్‌సిలను కూడగట్టుకుని ఎస్‌సి ఎ, బి, సి, డి వర్గీకరణ లక్ష్యంగా దేశ వ్యాప్తంగా అనేక రాజకీయ పార్టీల మద్దతును కూడగడుతూ పార్లమెంటులో ఎస్‌సి వర్గీకరణ చట్టం చేసేలా పోరాటాలు కొనసాగిస్తున్నది.

ఎంఆర్‌పిఎస్ ఉద్యమం శక్తివంతమైన ఉద్యమంగా గ్రహించిన వివిధ రాజకీయ పార్టీలా నాయకులు, పాలకులు అటు మాల ఇటు మాదిగ కులాల మధ్య చిచ్చు పెడుతూ తమ రాజకీయ పబ్బం గడుపుకున్నారే తప్ప దళితుల మధ్య ఉన్న చిన్న సమస్యను పరిష్కరించలేకపోయారు. ఈ పోరాటంలో ఎంతో మంది అమరులయ్యారు. సామాజిక న్యాయం కోసం జరుగుతున్న ఎంఆర్‌పిఎస్ పోరాటం జనాభా దామాషా ప్రకారం మేమెంతో మాకు అంత అనే నినాదంతో ముందుకు సాగుతున్నది.2011 జనాభా లెక్కల ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎస్‌సి జనాభా 1,38,78,078 ఉండగా వీరిలో మాదిగలు 67,02,609 మంది కాగా, మాలలు 55,70,244 మంది ఉన్నారు. అంటే మాలల కంటే మాదిగలు ఉమ్మడి రాష్ట్రంలో 11 లక్షల మంది ఎక్కువగా ఉన్నారనేది అక్షర సత్యం. అయితే ఎంఆర్‌పిఎస్ ఉద్యమం పోరాటాలను పరిగణనలోకి తీసుకున్న పాలకులు 1997లో న్యాయమూర్తి రామచంద్ర రాజు నేతృత్వంలోని కమిషన్ ఎస్‌సిలను వర్గీకరించాలని సిఫార్సు చేసింది.

అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 15% ఎస్‌సి కోటాను విభజిస్తూ జిఒను విడుదల చేసింది. ‘ఎ’ గ్రూపులో రెల్లి దాని అనుబంధ కులాలు సహా మొత్తం 12 కులాలను కలుపుతూ వారికి 1% కోట ఇవ్వగా, ‘బి’ గ్రూపులో మాదిగ దాని ఉప కులాలు మొత్తం 18 కులాలను చేరుస్తూ 7% కోటాను కేటాయించింది. ‘సి’ గ్రూపులో మాల దాని ఉప కులాలు 25 కులాలను చేరుస్తూ 6% కోటా కేటాయించగా, ‘డి’ గ్రూపులో ఆది ఆంధ్రులతో పాటు నాలుగు కులాలను చేర్చి 1% కోటాను నిర్ణయించారు. దీనిపై అప్పట్లో మాల మహానాడు కోర్టుకు వెళ్ళింది.
ఈ జిఒ రాష్ట్ర ప్రభుత్వ అధికార పరిమితికి మించిందని, రాజ్యాంగ విరుద్ధమైనదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆనాడు ప్రకటించింది. ఆ తర్వాత 2000 సంవత్సరంలో తిరిగి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఎస్‌సిలను వర్గీకరిస్తూ రిజర్వేషన్ల హేతుబద్ధీకరణ చట్టం చేసింది. అప్పటి ఎపి ప్రభుత్వం రాష్ట్ర అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదించింది. రాష్ట్రపతి కెఆర్ నారాయణన్ ఆమోదంతో అమల్లోకి వచ్చింది. అప్పట్లోనే ఎస్‌సిలను ఎ, బి, సి, డి గ్రూపులుగా వర్గీకరిస్తూ జనాభా నిష్పత్తి ప్రకారం ఆ కులాలకు కోటాలను నిర్ణయించారు.

కానీ 2004 నవంబర్‌లో సుప్రీం కోర్టు ఆ అంశాన్ని కొట్టివేయడంతో మళ్లీ మొదటికొచ్చింది. 2004 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్గీకరణ విషయం పై ఒత్తిడి పెరిగి రాజ్యాంగ సవరణ కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేయించారు. దీనికి ప్రతిస్పందనగా ఆనాడు సామాజిక న్యాయం, సాధికారిక మంత్రిత్వ శాఖ ఉషా మెహ్రా కమిషన్ ను ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2008లో మంత్రి మీరా కుమార్ కు కమిషన్ నివేదిక సమర్పించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 సవరించాలని ఆర్టికల్‌లో 3వ క్లాజును చేర్చడం ద్వారా రాష్ట్ర అసెంబ్లీలు ఏకగ్రీవ తీర్మానం చేసిన పక్షంలో కులాల వర్గీకరణను పార్లమెంట్ ఆమోదించవచ్చని ఉషా మెహ్రా కమిషన్ సిఫారసు చేసింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఉషా మెహ్రా కమిషన్ నివేదికను సీరియస్‌గా తీసుకోకపోవడంతో పరిష్కారంకు నోచుకోలేదు. అనంతరం 2014 ఎన్నికల అప్పుడు తాము అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే ఎస్‌సి వర్గీకరణ చేస్తామని బిజెపి ఇచ్చిన హామీ హామీగానే మిగిలిపోయింది. వర్గీకరణ విషయంలో అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపినా ఫలితం లేకుండా పోయింది.

ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికలకు ముందే హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన మాదిగల విశ్వరూప మహాసభకు ప్రధాని నరేంద్ర మోడీ హాజరై వర్గీకరణకు చట్టబద్ధత కల్పించేందుకు కమిటీని వేస్తున్నామని ప్రకటించి ఎస్‌సి కులాల్లో ఆశలు రేపారు. తాను ఎంఆర్‌పిఎస్‌కు నాయకత్వం వహిస్తున్న కృష్ణ మాదిగ సహచరుడిగా వర్గీకరణ ఉద్యమంలో పాలు పంచుకుంటానని ప్రసంగించిన మోడీ మాటలు మరింత ఆసక్తిని రేపాయి. మరి ప్రస్తుతం జరుగుతున్న శీతాకాల పార్లమెంటు సమావేశాల్లోనైనా ప్రధాని మోడీ హామీ మాట నిలుపుకుంటారా? ఎస్‌సి వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టీ చట్టబద్ధత కల్పించేందుకు మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న విధానాలపై ఎస్‌సి కులాలు ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News