హైదరాబాద్: వరికి ప్రత్యామ్నాయంగా పంటల మార్పిడి కోసం ఆయిల్ పామ్ సాగు వైపు రైతులకు ప్రోత్సాహం అందించనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. రైతులకు ప్రోత్సాహం అందించే కార్యక్రమంలో భాగంగా పాన్గల్ సమీపంలోని తన వ్యవసాయ క్షేత్రంలో సోమవారం ఆయిల్ పామ్ మొక్కలను నాటారు. -బీచుపల్లి ఆయిల్ మిల్లు పునరుద్ధరణ తరువాత పాలమూరులో తొలి ఆయిల్ పామ్ రైతుగా మంత్రి స్వయంగా ఎనిమిది ఎకరాలలో ఆయిల్పామ్ సాగును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- ఆయిల్ పామ్ సాగుకు ప్రభుత్వం నుండి సంపూర్ణ సహకారం -అందిస్తామన్నారు. ఆయిల్ పామ్ సాగుకు తెలంగాణ అనుకూలమన్నారు.
హెక్టారుకు 15 నుండి 25 టన్నుల దిగుబడి – వస్తుందన్నారు. ఆయిల్ పామ్ మొక్కల మధ్యలో అంతర పంటల సాగుకూ అవకాశం ఉందని తెలిపారు.- ప్రతి ఏటా దేశం రూ.40 వేల కోట్ల విలువైన పామాయిల్ను దిగుమతి చేసుకుంటుందని, ఆయిల్ పామ్ పంట సాగుతో విదేశీ మారకద్రవ్యం ఆదా చేయవచ్చునన్నారు. – ఆయిల్ పామ్ పంటకు కోతులు, పందుల బెడద కూడా ఉండదని చెప్పారు. రవాణా ఖర్చులు కూడా ఆయిల్ ఫెడ్ భరించి కొనుగోలు చేస్తున్న ఏకైక పంట ఆయిల్ పామ్ అని, ఈ సాగుతో రైతుకు అధిక ఆదాయంతో పాటు నీటి అవసరం కూడా ఇతర పంటలకన్నా తక్కువగా ఉంటుందన్నారు.
ఎకరా వరికి రోజుకు 60 వేల లీటర్ల నీటి అవసరమని, అదే ఎకరా ఆయిల్ పామ్ సాగుకు రోజుకు 10 వేల లీటర్ల నీరు మాత్రమే అవసరం అవుతాయన్నారు. ఎకరాలో 60 ఆయిల్ పామ్ మొక్కల సాగుకు అవకాశం ఉందని పేర్కొన్నారు. పత్తి పంటకన్నా అధిక లాభాలు పొందే అవకాశం ఉందన్నారు. – మొక్కలు నాటిన మూడున్నర, నాలుగేళ్ల నుండి ఆయిల్ పామ్ గెలల దిగుబడి వస్తుందన్నారు. 30 ఏళ్ల వరకు దిగుబడి కొనసాగుతూనే ఉందని వివరించారు. – తెలంగాణలోని 240 మండలాలు ఆయిల్ పామ్ సాగుకు అత్యంత అనుకూలం అని కేంద్రం సర్వేలో వెల్లడైందని తెలిపారు.