Monday, May 13, 2024

ఈ-శ్రమ్‌లో ఈ ఏడాది కోటి మంది లక్ష్యం

- Advertisement -
- Advertisement -

2023 ఏడాదిలో చేరింది 43 లక్షల మందే
కార్మిక శాఖ అధికార వర్గాల వెల్లడి

మన తెలంగాణ / హైదరాబాద్ : కొత్త సంవత్సరం.. కొత్త ప్రభుత్వం .. అందురూ అనుకుంటున్నట్లే సరికొత్త ఆలోచనా విధానంలో పాలకులు ముందుకు వెళ్తున్న క్రమంలో కార్మిక శాఖకు ఎస్. కృష్ణ ఆదిత్య ఐఏఎస్ నూతన కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఉన్న అహ్మద్ నదీమ్ స్థానంలో కొత్త బాస్ రావడంతో ఆ శాఖ అధికారులు మరింత జాగ్రత్తగా విధులు నిర్వహించనున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను కూడా పక్కాగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకు ఈ శ్రమ్ నే తీసుకుంటే… 2023 ఏడాది డిసెంబర్ ముగింపు వరకు దాదాపు 43 లక్షల మంది మాత్రమే ఈ-శ్రమ్ రిజిస్ట్రేషన్‌ను నమోదు చేసుకున్నారు. గత 2023లోనే కోటి మంది వరకు చేర్చాలనుకున్నా.. వివిధ కారణాల వల్ల ఈ సంఖ్య అరకోటి లోపే పరిమితం అయిపోయింది. అయితే ఈ కొత్త సంవత్సరం అయినా అనుకున్నట్లుగా కోటికి చేరుస్తామని ఆ శాఖ అధికార వర్గాలు చెబుతున్నాయి.

ఈ-శ్రమ్ పేరిట కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన వెబ్ పోర్టల్‌లో కార్మికుల నమోదు ప్రక్రియను కొత్త సర్కారు వేగవంతం చేసే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రం నుండి ఇప్పటి వరకు 43 లక్షల 6 వేల 188 మంది కార్మికులు చేరారు. ఈ సంఖ్యను 2024లో అయినా కోటికి చేరుస్తామని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ-శ్రమ్ లో పేర్లు నమోదు చేసుకున్న వారికి వచ్చే కార్డు ద్వారా కలిగే లబ్దికి కార్మికులకు ఆ శాఖ వివరిస్తోంది. ఈ-శ్రమ్ లో చేరిన ప్రతి అసంఘటిత రంగ కార్మికుడికి 12 అంకెలు గల ప్రత్యేక గుర్తింపు కార్డు యూనివర్సల్ ఐడెంటిఫికేషన్ నెంబర్‌ను ఇవ్వనున్నారు. ఒక వేళ ఈ కార్డు గనుక ఉంటే ప్రభుత్వం కార్మికులకు అందించే అన్ని రకాల సామాజిక భద్రత పథకాలతో పాటు వివిధ సంక్షేమ పథకాలు వర్తించనున్నాయి. నిజానికి ఈ- శ్రమ్ పోర్టల్ ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు 43 లక్షల 6 వేల 188 మంది ఈ- శ్రమ్ పోర్టల్ లో తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకున్న నేపథ్యంలో ఏదైని పరిస్థితుల్లో ఆయా కార్మికుడు మరణించినా, లేదా గాయపడినా ఈ డేటాబేస్‌నే ప్రామాణికంగా తీసుకుని వారికి ప్రభుత్వ పరంగా సహాయం అందించనున్నారు.
ఈ-శ్రమ్‌లోకి ఏ జిల్లా నుండి ఎంత మంది
హైదరాబాద్ జిల్లా నుండి 3,29,725, రంగారెడ్డి జిల్లా నుండి 3,18,092, ఖమ్మం జిల్లా నుండి 2,03,348, నల్గొండ జిల్లా నుండి 1, 99,729, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి 1,75,773, కరీంనగర్ జిల్లా నుండి 1,64,398, మహబూబ్‌నగర్ జిల్లా నుండి 1,55,611, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నుండి 1,51,033, కామారెడ్డి జిల్లా నుండి 1,50,716, సంగారెడ్డి జిల్లా నుండి 1,49,464, హన్మకొండ జిల్లా నుండి 141797, జగిత్యాల జిల్లా నుండి 1,30,299, ఆదిలాబాద్ జిల్లా నుండి 1,29,254, సూర్యాపేట జిల్లా నుండి 1,26,927, మహబూబాబాద్ జిల్లా నుండి 1,25,275, వరంగల్ జిల్లా నుండి 1,23,012, నిజామాబాద్ జిల్లా నుండి 1,21,631, సిద్దిపేట జిల్లా నుండి1,19,931, పెద్దపల్లి జిల్లా నుండి 1,15,387, మంచిర్యాల జిల్లా నుండి 1,07,930, జోగులాంబ గద్వాల జిల్లా నుండి 1,05,553, నాగర్ కర్నూలు జిల్లా నుండి 97,970, జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుండి 96,361, నిర్మల్ జిల్లా నుండి 94,551, యాదాద్రి భువనగిరి జిల్లా నుండి 91,299 వికారాబాద్ జిల్లా నుండి 91,299 వనపర్తి జిల్లా నుండి 88,035, మొదక్ జిల్లా నుండి 86,314 నారాయణపేట జిల్లా నుండి 71,112 , రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి 66,547 జనగామ జిల్లా నుండి 64,107 , కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా నుండి 59,071 , ములుగు జిల్లా నుండి 52,041 మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. అత్యధికంగా తమ పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిలో హైదరాబాద్ జిల్లా వాసులే అత్యధికంగా ఉన్నారు. ఈ జిల్లాలో 3 లక్షల29 వేల 725 మంది, కాగా అత్యల్పంగా ములుగు జిల్లా నుండి 52 లక్షల 41 మంది మాత్రమే తమ పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవడం గమనార్హం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News