Sunday, April 28, 2024

నాకు దక్కిన గౌరవం వాళ్లదే: చిరు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవికి కేంద్రం పద్మవిభూషణ్ ప్రకటించింది. పద్మవిభూషణ్ అవార్డు దక్కినందుకు చాలా సంతోషంగా ఉందని తన ట్విట్టర్ లో చిరంజీవి తెలిపారు. ఒకే తల్లి కడుపున పుట్టకపోయినా తనని సొంత మనిషిగా, అన్నయ్యగా, బిడ్డగా భావించిన కోట్లాది మంది అభిమానులు ఆశీస్సులు, తన సినీ కుటుంబం అండదండలు, ప్రేమ ఆదరణ వల్లే ఈ రోజు స్థాయిలో ఉన్నానని చిరు పేర్కొన్నారు. తన దక్కిన గౌరవం వాళ్లదేనని ఆయన స్పష్టం చేశారు. తనపై చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయతలకు తాను ఏమిచ్చి రుణం తీర్చుకోగలను అని, తనపై చూపిస్తున్న కొండంత అభిమానానికి ప్రతిగా ఇస్తున్నది గోరంతే అని , తన 45 ఏళ్ల సినీ ప్రయాణంలో వెండితెరపై వైవిధ్యమైన పాత్రలు వేశానని, వినోదం పంచడానికే శక్తి మేర ప్రయత్నిస్తున్నానని చెప్పారు. నిజజీవితంలో కూడా తన చుట్టూ ఉన్న సమాజానికి చేతనైనంత సాయం చేస్తున్నానని చెప్పుకొచ్చారు. ప్రతిష్ఠాత్మకమైన పద్మవిభూషణ్ అవార్డుకు ఎంపిక చేసిన భారత ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోడీకి చిరు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

చిరంజీవి 1955 ఆగస్టు 22న మొగల్లూరులో జన్మించారు. 2006లో మెగాస్టార్ చిరంజీవి పద్మభూషన్ అందుకున్నారు. 1978లో పునాదిరాళ్లు అనే సినిమాతో చిరు సినీ రంగంలోకి ప్రవేశించారు. నాలుగున్నర దశాబ్దాలుగా సినీరంగానికి చిరంజీవి విశేష సేవలు అందించారు. ఇప్పటివరకు 155 చిత్రాల్లో ఆయన నటించారు. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ద్వారా సామాజిక సేవ చేస్తున్నారు. కరోనా వేళ సినీ కార్మికులకు నిత్యావసరాలు పంచారు. 2006లో చిరును ఎయు డాక్టరేట్‌తో సత్కరించింది. చిరు ఇప్పటివరకు మూడు నంది అవార్డులు, తొమ్మిది ఫిల్మ్‌పేర్ అవార్డులు, 2016లో రఘుపతి వెంకయ్య అవార్డు, ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆప్ ది ఇయర్ అవార్డులు అందుకున్నారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. గతంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా కూడా పని చేశారు. 2012 నుంచి 2018 వరకు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News