Tuesday, April 30, 2024

అమర్‌నాథ్ యాత్రే లక్ష్యంగా మాగ్నెటిక్ బాంబులు.. పాక్ డ్రోన్ కూల్చివేత

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: అమర్‌నాథ్ యాత్రలో విధ్వంసం సృష్టించాలని పాక్ చేసిన యత్నాలను జమ్ముకశ్మీర్ పోలీస్‌లు భగ్నం చేశారు. పాకిస్థాన్ నుంచి వస్తున్న ఓ క్వాడ్ కాప్టర్‌ను కదువాలోని తాల్లీ హరియా చాక్ గ్రామం వద్ద పోలీసులు ఆదివారం కూల్చివేశారు. ఆ డ్రోన్ నుంచి ఏడు మాగ్నెటిక్ బాంబులను ఏడు యూజీబీఎల్ గ్రనేడ్లను స్వాధీనం చేసుకున్నారు. తొలుత డ్రోన్ కదలికలను రాజ్‌బాఘ్ పోలీసులు ఏర్పాటు చేసిన సెర్చిపార్టీ గుర్తించింది. అది పాకిస్థాన్ వైపు నుంచి వస్తున్నట్టు గుర్తించి వెంటనే దానిపై వారు కాల్పులు జరిపారు. అమర్‌నాధ్ యాత్రను లక్షంగా చేసుకొని ఈ పేలుడు పదార్ధాలను తెచ్చినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఈ డ్రోన్ తీసుకొచ్చిన మాగ్నెటిక్ బాంబులను చార్‌ధామ్ యాత్ర బస్సులకు అమర్చేందుకు తెప్పించి ఉంటారని భావిస్తున్నారు. ఈ బాంబులను మెకానిక్ షెడ్లలో కూడా తయారు చేయవచ్చు. వీటికి 25 డాలర్లకు మించి ఖర్చు కాదు. చిన్న డబ్బాలో పేలుడు పదార్ధాలు అమర్చి దానిని సెల్‌ఫోన్‌తో అనుసంధానిస్తారు. దీనికి ఒక అయస్కాంతం అమరుస్తారు. దీన్ని ప్రత్యర్థి వాహనం కింద ఇంధన ట్యాంక్ సమీపంలో పెట్టి, బాంబుకు అమర్చిన మొబైల్ నెంబరుకు ఫోన్ చేస్తారు. దీంతో భారీ పేలుడు సంభవిస్తుంది. అమెరికా సేనలను, ఇతర అధికారులను హత్య చేసేందుకు గతంలో తాలిబన్లు మాగ్నెటిక్ బాంబులను విరివిగా వాడేవారు.

Pak Drone shot down in Jammu Kashmir

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News