హైదరాబాద్: ఓ రోగి ఆస్పత్రి భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన హైదరాబాద్లోని సనత్నగర్లో ఇఎస్ఐ ఆస్పత్రిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఐడిపిఎల్ కాలనీకి చెందిన శేఖర్కు గత కొన్ని రోజుల నుంచి జ్వరం వస్తుండడంతో అతడిని కుటుంబ సభ్యులు ఇఎస్ఐ ఆస్పత్రిలో చేర్పించారు. రక్త కణాలు తక్కువగా ఉండడం వలన ఆయన ఊపిరితిత్తులు పాడైనట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శేఖర్ మూడో అంతస్థుకు చేరుకొని కిటికీ అద్దాలు పగులగొట్టి కిందకు దూకాడు.
వెంటనే ఆస్పత్రి సిబ్బంది అతడిని ఐసియు తరలించి చికిత్స అందించినప్పటికి మృతి చెందాడు. తలకు బలమైన గాయాలు కావడంతో మృతి చెందాడని డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ శైలజ తెలిపింది. శేఖర్ కు సరైన వైద్యం అందించామని మానసిక స్థితి బాగోలేక ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని అభిప్రాయం వ్యక్తం చేసింది. వైద్యులు సరైన చికిత్స అందించకపోవడంతోనే తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని తల్లిదండ్రులు ఆరోపణలు చేస్తున్నారు.