కరోనా కట్టడిలో కెసిఆర్ పనితీరుకు ప్రజలు ఫిదా
ప్రధాని మోడీ కంటే సిఎంకే ఎక్కువ మార్కులు
ప్రభుత్వ పనితీరు బాగుందని ఓ వార్తా ఛానెల్ సర్వేలో ప్రశంసలు
మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా కట్టడిలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు పనితీరు, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలపై ప్రజలు ఫిదా అవుతున్నారని ప్రముఖ ఎలక్ట్రానిక్ న్యూస్ ఛానెల్ నిర్వహించిన సర్వేలో తేలింది. కరోనా మహమ్మారిని పకడ్బందీగా ఎదుర్కోవడంలో సిఎం అద్భుతంగా పనిచేస్తున్నారని ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్రమోడీ కంటే సిఎం కెసిఆర్కే ఎక్కువ మార్కులు రావడం విశేషం.
లాక్డౌన్, కరోనా కట్టడిపై ఆ ఛానల్ ఏప్రిల్ 29 నుంచి మే 2 మధ్య తాజాగా సర్వే చేసింది. ఇందులో తెలంగాణ ప్రభుత్వం పనితీరు ఎలా ఉందని ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకున్నారు. ప్రభుత్వ పనితీరు చాలా బాగుందని 83.6శాతం మంది కితాబిచ్చినట్లు సర్వేలో వెల్లడైంది. పరవా లేదని 5.8శాతం, బాగోలేదని 0.6 శాతం మంది వెల్లడించారు. అలాగే కరోనాపై సిఎం కెసిఆర్ పనితీరు ఎలా ఉందని కూడా సర్వే నిర్వహించగా బాగుందని 84.8శాతం మంది, పర్లేదని 14.0శాతం, -బాగాలేదని 1.2శాతం మంది సమాధానమిచ్చారు. కరోనా నియంత్రణలో ప్రధాని నరేంద్ర మోదీ కన్నా సిఎం కెసిఆర్ పనితీరుకే ఎక్కువ మంది ఓటేశారు.
పనితీరుపై ప్రధాని, సిఎంపై విడివిడిగా సర్వే చేయగా మోదీకి 76.2 శాతం మంది ఓకే చెప్పగా..కెసిఆర్ 84.8 శాతంగా మంది జైకొట్టారు. కరోనా నియంత్రణకు కెసిఆర్ అహర్నిశలు కృషిచేస్తున్నారని కొనియాడారు. లాక్డౌన్తోనే వైరస్ను కట్టడి చేసే అవకాశం ఉందని సిఎం కెసిఆర్ తీసుకుంటున్న చర్యలు తమకు సమంజసమేనని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. లాక్డౌన్ నేపథ్యంలో పేదలు, కార్మికులు, మధ్య తరగతి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకుండా రేషన్, కూరగాయలు, నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉంచారని చెప్పుకొచ్చారు.