న్యూఢిల్లీ: బెంగాల్ రైతాంగానికి అక్కడి మమత ప్రభుత్వం ద్రోహం చేస్తోందని ప్రధాని మోడీ విమర్శించారు. కేంద్రం తరఫున అందే ప్రయోజనాలను రైతులకు అందకుండా తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకొంటోందని ఆరోపించారు. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి వాయిదా చెల్లింపు కార్యక్రమం దశలో ప్రధాని మాట్లాడారు. మమత ప్రభుత్వ వైఖరితో రాష్ట్రానికి చెందిన 70 లక్షల మందికి పైగా రైతులకు అన్యాయం జరుగుతోందన్నారు. రైతుల కోసం ఉద్ధేశించిన కార్యక్రమాలను అడ్డుకోవడం ద్వారా మమత ఏకంగా బెంగాల్నే నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. పిఎం కిసాన్ స్కీమ్ను రాష్ట్రంలో అమలు చేయరాదని మమత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మోడీ తప్పుపట్టారు. బెంగాల్ రైతులకు కేంద్రం మేలు చేయాలని చూస్తోంది. అయితే అక్కడి సర్కారు అడ్డుకొంటోంది. ఇక అక్కడ మూడు దశాబ్దాల పాటు అధికారంలో ఉన్న వామపక్షాలు కూడా వ్యవసాయ రంగానికి చేసిందేమీ లేదని, రైతులకు మేలు తలపెట్టలేదన్నారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగే బెంగాల్ గురించి ప్రధాని మోడీ తమ ప్రసంగంలో ప్రత్యేకంగా ఎక్కువగానే ప్రస్తావించారు.
బెంగాల్ను నాశనం చేస్తున్న మమత
- Advertisement -
- Advertisement -
- Advertisement -