అలహాబాద్: కవి, సిద్ధాంతకర్త షంషూర్ రెహ్మన్ ఫరూకీ కన్నుమూశారు. ఆయనకు కరోనా వచ్చినట్లు నవంబర్లో నిర్థారణ అయింది. ఉర్దూ సాహిత్యంలో ప్రఖ్యాత వహించిన కవిగా రెహ్మన్కు పేరుంది. శుక్రవారం మధ్యాహ్నం ఆయన మృతి చెందిన వార్తను ఆయన ట్విట్టర్ ద్వారా సన్నిహితులు ధృవీకరించారు. 1935 సెప్టెంబర్ 30వ తేదీన ఆయన జన్మించారు. ఉర్దూ సాహిత్యంలో పశ్చిమ సాహితీ విమర్శలపై ఆయన చాలా కాలం దృష్టి సారించారు. కవిగానే కాకుండా నవలాకారుడిగా కూడా ప్రతిష్ట తెచ్చుకున్నారు. ఉర్దూ పత్రిక షబ్కూన్ సారధ్య బాధ్యతలను నాలుగు దశాబ్దాలు చేపట్టారు.
మైనార్టీలు ఎదుర్కొంటూ వచ్చిన పలు సమకాలీన సమస్యలపై దృష్టి సారిస్తూ ఆంగ్ల దినపత్రికలలో వ్యాసాలు కూడా రాశారు. వ్యక్తిగతంగా తాను బుర్ఖా పద్ధతికి వ్యతిరేకిని అని, ప్రజాస్వామిక కాంక్షను వ్యక్తపర్చే ప్రతి ఒక్క మైనార్టీని అభిమానిస్తానని తెలిపేవారు. ఇదే ఆయన వ్యక్తిత్వానికి ప్రతీక అయింది. ఆయన జీవితం అంతా అలహాబాద్ కేంద్రీకృతంగానే సాగింది. అభ్యుదయ రచయితల తీరు తెన్నులను ఆయన విమర్శించే వారు. ఇతర రచయితలను, విభిన్న సాహితీ ప్రక్రియలను వీరు అణచివేస్తూ ఉంటారని, సాహిత్యం అనేది కేవలం మార్కిస్టు పద్థతులకు అనుగుణంగా కేవలం సామాజిక పరివర్తన శక్తులను కేంద్రీకృతం చేసుకునే ఉండాలని చెపుతూ ఉంటారని విమర్శించారు. సరికొత్త రచయితలను అభ్యుదయవాదులు ఎప్పుడూ ప్రోత్సహించలేదని అనేవారు.
Urdu poet Shamsur Rahman Faruqi passes away