మనతెలంగాణ/హైదరాబాద్ : ఆకలితో అలమటిస్తున్న యాచకునికి తన భోజనాన్ని ఇచ్చి ఓ పోలీసు ‘అన్న’దానగుణం చాటుకున్నాడు. పోలీసులు పైకి కరుకుగా కనిపిస్తారే కానీ మానవత్వం ముందు కరిగే మంచుకొండలని నిరూపించాడు ఓ పోలీసు. ఈ వీడియో దృశ్యాలను చూసి చలించిన ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్ తన ట్విటర్ లో షేర్ చేశారు. ఈ పోలీసు అధికారి మానవత్వం, వ్యక్తిత్వం అద్భుతమని కొనియాడారు. ఆకలితో ఉన్న యాచకునికి తాను తెచ్చుకున్న భోజనం ఇచ్చేశాడని, ఇది ప్రతీఒక్కరూ మెచ్చుకోదగ్గ విషయమంటూ ఎంపి సంతోష్కుమార్ సదరు ‘పోలీసుకు సెల్యూట్ ’ అని ట్వీట్ చేశారు. ఇదిలాఉండగా అన్ని దానాల కంటే అన్న దానం మరొకటి లేదని పెద్దలు చెబుతుంటారు. ఎదుటి వ్యక్తి ఆకలి తీర్చడంలో ఎంతో సంతోషం లభిస్తుంది. లాక్ డౌన్ నేపథ్యంలో విధి నిర్వహణలో ఉన్న పోలీసు అధికారి మానవత్వంతో వ్యవహరించిన తీరు నెటిజన్లను ఫిదా చేసింది.
పోలీసు తన సిబ్బందితో కలిసి భోజనం చేయడానికి కూర్చున్నారు. భోజనం చేసే సమయంలో ఓ యాచకుడు అక్కడికి వచ్చినిల్చున్నాడు. అది గమనించిన పోలీసు అధికారి తన చేతిలో ఉన్న ఆహారం అతడికి పెట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందో మాత్రం వివరాలు చెప్పలేదు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రజల కోసం పనిచేస్తున్న పోలీసులు, వారి తీరును ప్రశంసించాలి, ఎదుటి వ్యక్తి ఆకలి తీర్చడం అన్నింటికన్నా పెద్ద సహాయం, మానవత్వానికి మరో రూపం ఈ పోలీసులు అంటూ నెటిజన్లు రకరకాల కామెంట్లు చేశారు. ఈ వీడియో చూసిన దర్శకుడు క్రిష్ కూడా స్పందించారు. ఈక్రమంలో ఎంపి సంతోష్, దర్శకుడు క్రిష్లు యాచకునికి పోలీసు ‘అన్న’దానం చేసిన వైనంపై సెల్యూట్ చేస్తున్నామనిని ట్వీట్చేశారు.