దుబాయి: ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సిన పురుషుల ట్వంటీ20 ప్రపంచకప్ షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) స్పష్టం చేసింది. కరోనా నేపథ్యంలో వరల్డ్కప్ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. దీనిపై ఐసిసి స్పందించింది. వరల్డ్కప్ నిర్వహణకు సంబంధించి సభ్య దేశాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. ప్రపంచకప్ ప్రారంభానికి ఇంకా చాలా సమయం మిగిలివుందని, అప్పటి వరకు కరోనా పూర్తిగా తగ్గు ముఖం పట్టడం ఖాయమని జోస్యం చెప్పింది. ఇక, కరోనా తగ్గిపోతే తాము విధించిన ఆంక్షలను ముందే ఎత్తేస్తామని ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇప్పటికే తమకు హామీ ఇచ్చిందని ఐసిసి వివరించింది. పరిస్థితులు త్వరగానే మాములు స్థితికి చేరడం ఖాయమని, దీంతో ప్రపంచకప్ షెడ్యూల్ను మార్చాల్సిన అవసరం లేదని ఐసిసి పేర్కొంది. ఇక, మిగిలిన సిరీస్లు, ఐసిసి ప్రపంచకప్ అర్హత పోటీల గురించి కూడా త్వరలోనే స్పష్టమైన ప్రకటన చేస్తామని తెలిపింది. కాగా, టెస్టు ఛాంపియన్షిప్ గురించి ఇప్పటికిప్పుడూ స్పందించడం సాధ్యం కాదని, కొంత కాలం వేచి చూసిన తర్వాతే ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామని ఐసిసి స్పష్టం చేసింది.