Saturday, April 27, 2024

70 శాతం పోలింగ్ నమోదు

- Advertisement -
- Advertisement -

ప్రశాంతంగా ముగిసిన పోలింగ్…

అత్యధికంగా మెదక్, అత్యల్పంగా హైదరాబాద్

పట్టణాలకంటే, గ్రామీణ ప్రాంతాల్లో కదిలిన ఓటర్లు
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 4 గంటలకే ముగిసిన పోలింగ్
సాయంత్రం 5 గంటల వరకు క్యూలో ఉన్నవారికి ఓటు అవకాశం
ఆదిలాబాద్ జిల్లాలో అస్వస్థతతో ఇద్దరు వృద్దులు మృతి
సిద్దిపేట జిల్లాలో గుండెపోటు ఒకరు ప్రాణాలు కోల్పోయారు
మలక్‌పేట కాంగ్రెస్ అభ్యర్థి షేక్ అక్బర్‌పై మజ్లిస్ దాడి
అగ్రనేతల పోటీ చేసిన స్థానాల్లో భారీగా పోలింగ్ నమోదు

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో చెదురుమదురు సంఘటనలు మినహా ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మూడు కోట్ల మంది ఓటర్ల తీర్పును ఈవిఎంలో నింక్షిప్తం చేశారు. గురువారం సాయంత్రం ఐదు గంటల వరకు 65.01 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. అత్యధికంగా మెదక్ జిల్లాలో 80. 28 శాతం, అత్యల్పంగా హైదరాబాద్ జిల్లాలో 47.14 శాతం నమోదైంది. 2018 ఎన్నికల్లో 73.14 శాతం నమోదు కాగా, 2023 ఎన్నికల్లో గత ఎన్నికల కంటే 10 శాతం తక్కువ నమోదైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్ర 5 గంటల వరకు పోలింగ్ జరిగింది. సరిహద్దులోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన 13 నియోజకవర్గాల్లో మాత్రమే సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది. మిగిలిన 106 నియోజకవర్గాల్లో సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ కొనసాగింది. గడువులోగా వచ్చిన ఓటర్లను పోలింగ్ కేంద్రాల్లో వరుసలో ఉంచి ఓటు వేయించారు.

కొన్ని చోట్ల గడువు ముగిసిన తరువాత వచ్చిన వారికి అనుమతి ఇవ్వలేదు. ఉదయం నుంచి మందకొడిగా పోలింగ్ జరగ్గా మధ్యాహం నుంచి ఓటర్లు పోటెత్తారు. నగరాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లో మొదటి నుంచి పోలింగ్ నమోదు శాతం ఎక్కువగా ఉంది. శేరిలింగంపల్లి , మహేశ్వరం ఆల్మాస్‌గూడ, ఇబ్రహింపట్నంతో పాటు కొన్ని చోట్ల ఈవిఎంలు మొరాయించడంతో ఆలస్యంగా ప్రారంభమైంది. కేంద్రాల్లోకి సెల్‌పోన్లు అనుమతి లేకపోవడంతో కొంతమంది క్యూలైన్‌లో ఉండలేక, పోలింగ్ కేంద్రాలకు వెళ్లలేక ఓటు వేయకుండా ఇంటికి తిరిగి వెళ్లారు. పోలింగ్ కేంద్రాలోకి వెళ్లే ముందు పోన్ డిపాజిట్ చేసే వెసులుబాటు కల్పించాలని పలువురు కోరారు. పలు ప్రాంతాల్లో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య ఉద్రికత్త చోటు చేసుకుంది. వెంటనే పోలీసులు రంగ ప్రవేశం చేసి గుంపులను చెదరగొట్టి పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా చర్యలు చేపట్టారు. ఎన్నికల్లో మొత్తం 2290 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అందులో 2068 పురుషులు, 221 మంది మహిళలు, ఒకరు ట్రాన్స్‌జెండర్ పోటీ ఉన్నారు.

ఆదిలాబాద్ జిల్లాలో ఓటు వేయడానికి వచ్చిన ఇద్దరు వృద్దులు అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయారు. మావల గ్రామానికి చెందిన తోకల గంగవ్వ (78) పోలింగ్ బూత్ దగ్గరికి వచ్చే సరికి ఫిట్స్ వచ్చి పడిపోయింది. దీంతో ఆమెను రిమ్స్‌కు తరలించగా అప్పటికే మృతి చెందింది. భూక్తాపుర్‌కు చెందిన రాజన్న (65)అనే వృద్దుడు ఓటేసేందుకు వరుసలో నిలబడ్డాడు. అంతలోనే కళ్లు తిరిగిపడిపోవడంతో రిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. సిద్దిపేట జిల్లాలోని భూంపల్లి రుద్రారం గ్రామంలో ఓటు వేసి నడుచుకుంటూ వెళ్లుతూ గుండెపోటుతో స్వామి (54) మృతి చెందాడు. అదే విధంగా పలుచోట్ల ఉద్రిక్తత పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. సూర్యాపేట జిల్లాలోని మఠంపల్లిలో వ్యక్తిని చితకబాదిన బిఆర్‌ఎస్ కార్యకర్తలు గాయ పడటంలో ఆసుపత్రికి తరలింపు, రంగారెడ్డి జిల్లా ఇబ్రహింపట్న ఖానాపూర్ మున్సిపాలిటీ వద్ద రెండు పార్టీ కార్యకర్తల మధ్య గొడవ లాఠీచార్జీ చేసిన పోలీసులు. జనగామ జిల్లా కేంద్రంలో ప్రెస్టన్ పాఠశాల వద్ద స్వల్ప ఉద్రిక్తత దీంతో ఇరువర్గాల మధ్య స్వల్ప ఘర్షణ జరిగింది. తాండూర్, నర్సాపూర్‌లో బిఆర్‌ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. మలక్‌పేటలో కాంగ్రెస్ అభ్యర్థి షేక్ అక్బర్‌పై మజ్లిస్ కార్యకర్తలు దాడి చేయగా పోలీసు లాఠీచార్జి చేసి కార్యకర్తలను చెదరగొట్టారు. వికారాబాద్ జిల్లా తాండూర్ మండలం కరన్‌కట్ నగదు కలకలం కోటవీధిలో పోలింగ్ కేంద్ర వద్ద నగదు పంపిణీ పోలీసుల రాకతో డబ్బువదిలేసి పారిపోయిన గుర్తు తెలియని వ్యక్తులు. రూ. 7.45లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

డబ్బులిస్తే ఓటు వేస్తామన్న ఓటర్లు ఆగ్రహం: మహబూబాబాద్ జిల్లాలో విచిత్రమైన పరిస్దితి నెలకొంది. డబ్బులిస్తే కానీ ఓట్లేయని ఓటర్లు నాయకులను డిమాండ్ చేసిన తీరు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. బయ్యారం మండలం సంతులాల్ పంచాయతీ పరిధిలోని ఎస్సీకాలనీ ఓటర్లు డబ్బులు ఇస్తేనే ఓట్లు వేస్తాం, అంటూ తేల్చి చెప్పారు. దీంతో ఓటేయాలంటూ అధికారులు బతిమాలడంతో సాయంత్రం వచ్చి ఓట్లు వేశారు. మరో పక్క బెల్లంపల్లి నియోజకవర్గం కాసిపేట మండలం వరిపేట గ్రామానికి చెందిన ఓటర్లు పోలింగ్ బహిష్కరించారు. ఉదయం 11గంటల వరకు 20మంది మాత్రమే ఓట్లు వేశారు. సమాచారం తెలిసిన అధికారులు గ్రామానికి చేరుకుని ప్రజలతో చర్చలు జరిపి ఓట్లు వేసేలా చేశారు.

అగ్రనేతల స్థానాల్లో భారీగా పోలింగ్ శాతం నమోదు:
సిఎం కెసిఆర్, టిపిసిసి చీప్ రేవంత్ బరిలో ఉన్న కామారెడ్డిలో 68.94 శాతం పోలింగ్ నమోదైంది. కెసిఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్ లో 76.17 శాతం పోలింగ్ నమోదైంది. ఈటల బరిలో ఉన్న హుజురాబాద్ లో 70.23 శాతం ఓటింగ్, రేవంత్ పోటీ చేస్తున్న కొడంగల్ లో 70.50 శాతం ఓటింగ్ నమోదైంది. భట్టి విక్రమార్క పోటీ చేస్తున్న మధిరలో 70.30 శాతం ఓటింగ్, బండి సంజయ్ బరిలో ఉన్న కరీంనగర్ లో 64.17 శాతం పోలింగ్ నమోదైంది. ఉత్తమ్ బరిలో ఉన్న హుజూర్ నగర్ 74.11 శాతం పోలింగ్ నమోదుకాగా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోటీ చేస్తున్న నల్గొండలో 72.99 శాతం ఓటింగ్ నమోదైంది.

కుటుంబ సమేతంగా ప్రముఖులు ఓటు: ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు దంపతులు సిద్దిపేట జిల్లా చింతమడక, మలక్‌పేటలో త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి, తెలంగాణ మంత్రులు హరీష్‌రావు సిద్దిపేటలో, అంబర్‌పేటలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, కరీంనగర్ జ్యోతినగర్‌లో బండి సంజయ్‌కుమార్, హన్మకొండలో మాజీ మంత్రి కడియం శ్రీహరి, ఎస్‌ఆర్‌నగర్‌లో సీఈవో వికాస్‌రాజు, బంజారాహిల్స్‌లోని డిల్లీ స్కూల్‌లో రాష్ట్ర ఎన్నికల కమిషన్ పార్థసారథి, తాండూర్‌లో మహేందర్‌రెడ్డి, నందినగర్‌లో తారక రామారావు, సూర్యాపేటలో జగదీష్‌రెడ్డి, బోయిన్‌పల్లి మంత్రి మల్లారెడ్డి, గోదావరిఖనిలో కొప్పుల ఈశ్వర్ దంపతులు ఓటు వినియోగించుకున్నారు. కోడంగల్ ఉన్నత పాఠశాలలో టిపిసిసి చీప్ రేవంత్‌రెడ్డి, జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్,తనయుడు అసదుద్దీన్ ఓటు వేశారు.

ఆక్సిజన్ సిలిండర్ తో వచ్చి  ఓటు వేసిన పెద్దాయన:  కొంతమంది అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఓటేసి పలువురికి ఆదర్శంగా నిలిచారు. గచ్చిబౌలికి చెందిన శేషయ్య(75) లివర్ సిరోసిస్‌తో బాధపడుతున్న ఆక్సిజన్ సిలిండర్ సాయంతోత జిపిఆర్‌ఏ క్యార్టర్స్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేయడానికి వచ్చాడు. ఓటు వేయడం ఓ పౌరుడిగా తన బాధ్యతని పెద్దాయన చెప్పారు. శేషయ్యకు సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 63.94 శాతం పోలింగ్ శాతం…

ఆదిలాబాద్ 73.58 శాతం…
భద్రాద్రి 66.37 శాతం…
హనుమకొండ 62.46 శాతం…
హైదరాబాద్ 39.97 శాతం…
జగిత్యాల 74.87 శాతం…
జనగాం 80.23 శాతం…
భూపాలపల్లి 76.10 శాతం…
గద్వాల్ 73.60 శాతం…
కామారెడ్డి 71.00 శాతం…
కరీంనగర్ 69.22 శాతం…
ఖమ్మం 73.77 శాతం…
ఆసిఫాబాద్ 71.63 శాతం…
మహబూబాబాద్ 77.50 శాతం…
మహబూబ్ నగర్ 73.70 శాతం…
మంచిర్యాల 70.71 శాతం…
మెదక్ 80.28 శాతం…
మేడ్చల్ 49.25 శాతం…
ములుగు 75.02 శాతం…
నాగర్ కర్నూల్ 70.83 శాతం…
నల్గొండ 75.72 శాతం…
నారాయణపేట 67.70 శాతం…
నిర్మల్ 71.47 శాతం…
నిజామాబాద్ 68.30 శాతం…
పెద్దపల్లి 69.83 శాతం…
సిరిసిల్ల 71.87 శాతం…
రంగారెడ్డి 53.03 శాతం…
సంగారెడ్డి 73.83 శాతం…
సిద్దిపేట 77.19 శాతం…
సూర్యాపేట 74.88 శాతం…
వికారాబాద్ 69.79 శాతం…
వనపర్తి 72.60 శాతం…
వరంగల్ 73.04 శాతం…
యాదాద్రి 78.31 శాతం పోలింగ్ నమోదు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News