న్యూఢిల్లీ: వ్యక్తిగత రక్షణ పరికరాలను (పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ పిపిఇ) వాడాలని ప్రభుత్వం జారీచేసే మార్గ దర్శకాల్లో సూచనలు చేయాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. అలాచేస్తే …దేశంలో కొవిడ్ చికిత్సలు జరగని ప్రాంతాల్లో పనిచేస్తున్న వైద్యవృత్తిలో ఉన్న వారికి పిపిఎ కిట్లు సమకూర్చాలని తెలిపింది. దేశంలో కొవిడ్ 19 వ్యాధి లక్షణాలు కనిపించని రోగుల సంఖ్య పెరుగుతోందని కోర్టుకు తెలియజేయడంతో జస్టిస్ ఎన్వి రమణ సారథ్యంలోని ధర్మాసనం ఈ ఆదేశాన్ని జారీచేసింది.
ఇందుకు సంబంధించి దాఖలైన దరఖాస్తును జస్టిస్ ఎస్కె కౌల్, జస్టిస్ బిఆర్ గవాయ్లతో కూడిన ధర్మాసనం పరిశీలించింది. కొవిడ్ చికిత్స జరగని ప్రాంతాల్లో వ్యాధి లక్షణాలు కనిపించని రోగుల నుంచి కరోనా వైరస్ అంటువ్యాధి వ్యాపిస్తోంది. కాబట్టి ఆ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఆరోగ్య కార్యకర్తలు డాక్టర్లు, నర్సులు, వార్డ్ బాయ్లు, మెడికల్, పారా మెడికల్ సిబ్బందికి పిపిఎ కిట్లు ఇవ్వాలని ఆ దరఖాస్తులో కోరారు. ‘దరఖాస్తు చేసిన వ్యక్తి చేసిన సూచనల్లో వాస్తవం ఉందని మేము గమనించాం. దాన్ని దృష్టిలో ఉంచుకొని , ఈ అంశాన్ని పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాం’ అని సుప్రీంకోర్టు సోమవారం తను జారీ చేసిన ఆదేశంలో పేర్కొంది.