మన తెలంగాణ/హైదరాబాద్: వేసవిలో చేపల సంరక్షణకు మత్యకారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర మత్సశాఖ సూచించింది. అధిక ఉష్ణోగ్రత కారణంగా, ఎక్కువ చేపల సాంద్రత ఉండడం, కరిగియున్న ప్రాణవాయువు కొరతతో పాటు ఇతర కారణాలతో చేపలు తీవ్రమైన ఒత్తిడికి గురి అవుతాయని ఈ క్రమంలో పెద్ద మొత్తంలో చేపలు చనిపోతూంటాయని ఒక ప్రకటనలో తెలిపింది. అంతే కాకుండా రోగకారక సూక్ష్మజీవులు వలన వ్యాధులు సంభవించే అవకాశాలు కూడా ఎక్కువ అవుతాయని మత్సశాఖ కమిషనర్ డాక్టర్ సువర్ణ పేర్కొన్నారు. చెరువులోని నీటి నాణ్యత, లోతు, విస్తీర్ణం, చేపల కదలికలు ప్రతి రోజు గమనిస్తూ ఉండాలని సూచించారు.
ఉదయాన్నే చేపలు చెరువు పై భాగాన నోరు తెరచుకొని తిరుగుతూ ఉంటే ప్రాణవాయువు కొరత ఉందని గమనించాలని, అలాంటి సందర్భాలలో చెరువులో నీరు పెట్టటం, ఆది సాధ్యం కాని పక్షంలో పెద్దగా పెరిగిన చేపలను పట్టి అమ్మి వేసుకోవాలని తెలిపారు. దీనివలన చేపల సాంద్రత తగ్గి ప్రాణవాయువు కొరతను అధిగమించవచ్చునన్నారు. మత్స్యకారులు చేపలు మార్కెట్ సైజు రాలేదనో లేదా మార్కెట్లో రేట్లు తక్కువున్నయనో, ఐస్ దొరకకపోవటం, మొ కారణాల వలన నిర్లక్ష్యం చేయొద్దని సూచించారు. చెరువులోని కలుపు మొక్కలని ఎప్పటి కప్పుడు తగ్గిస్తూ ఉండాలన్నారు. వ్యాధితో చేపలు చనిపోయినప్పుడు వెంటనే చనిపోయిన చేపలను తొలగించి చెరువుకు దూరంగా కాల్చివేయాలన్నారు.