హైదరాబాద్ : మరఠ్వాడ దాని పరిసర ప్రాంతాల్లో 0.9 కి.మీల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ అధికారులు పేర్కొన్నారు. దక్షిణ తమిళనాడు నుంచి ఛత్తీస్గఢ్ వరకు ఇంటీరియర్ కర్ణాటక, మరఠ్వాడ, విదర్భ మీదుగా 0.9 కి.మీల ఎత్తు వరకు ఉపరితల ద్రోణి ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం అక్కడక్కడ ఉరుములు మెరుపులతో పాటు తేలికపాటి వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉందని, సోమ, మంగళవారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
శనివారం రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల నమోదైన వర్షపాతం
శనివారం రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిశాయని వాతావరణ శాఖ తెలిపింది. కరీంనగర్లో 60 మిల్లీమీటర్లు, జయశంకర్ భూపాలపల్లి 44.3, రాజన్న సిరిసిల్ల 33.8, సిద్దిపేట 30.8, పెద్దపల్లి22.3, రంగారెడ్డి 13.8, మెదక్ 13.3, వరంగల్ అర్భన్ 12.5, వరంగల్ రూరల్ 12, జగిత్యాల 10, ములుగు 9.8, యాదాద్రి భువనగిరి 7.3, ఆదిలాబాద్ 6.5,మేడ్చల్ మల్కాజిగిరి 5.8, కామారెడ్డి 19 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యిందని వాతావరణ శాఖ తెలిపింది.
ఎపిలో ఆగ్నేయ దిశ నుంచి గాలులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా ఆగ్నేయ దిశ, తూర్పు దిశ నుంచి గాలులు వీస్తున్నాయని అధికారులు పేర్కొన్నారు.
కోస్తాంధ్ర, యానాంలలో ఆదివారం అక్కడక్కడ ఉరుములు మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సోమ, మంగళవారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. రాయలసీమలో సైతం ఆదివారం, సోమవారం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని, మంగళవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.