70వ జన్మదినం సందర్భంగా ప్రముఖుల ప్రశంసలు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ 70వ జన్మదినం సందర్భంగా దేశంలోని ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడుతో సహా పలువురు కేంద్ర మంత్రులు, బిజెపి అగ్రనాయకులు ఈ సందర్భంగా ప్రధాని మోడీకి పుట్టినరోజు శుభాకాంక్షలు అందచేశారు. రాష్ట్రపతి కోవింద్ ప్రధాని మోడీకి జన్మదిన శుభాకాంక్షలు అందచేస్తూ భారతదేశ జీవన విలువలు, ప్రజాస్వామిక సంప్రదాయాల పట్ల మీరు చూపిన అంకితభావంతో దేశానికే ఆదర్శప్రాయులయ్యారని ప్రశంసించారు. మీ అమూల్య సేవలు ఈ దేశానికి కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు. భారత దేశాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడంలో ప్రధాని మోడీ అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.
మోడీ కృషితో భారతదేశం స్వావలంబన సాధించడంలో విజయం సాధించగలదని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచ యవనికపై భారతదేశ ప్రతిష్ట మోడీ నాయకత్వంలో ఇనుమడించిందని, దేశ సంక్షేమం కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన మోడీ భారతీయులందరికీ స్ఫూర్తిగా నిలిచారని బిజెపి అగ్రనాయకులు కీర్తించారు. ప్రధాని మోడీ నాయకత్వంలో దేశం ప్రగతిపథంలో పురోగమిస్తోందని, జాతి నిర్మాణానికి అంకితమైన మోడీ జీవితం పార్టీ కార్యకర్తలందరికీ స్ఫూరిదాయకమని బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి ప్రేమను చూరగొన్న వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీ అంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలియచేశారు.
ప్రధాని మోడీ చేపట్టిన అభివృద్ధి ఫలాలు సమాజంలోని అట్టడుగు వర్గాలకు కూడా చేరుతున్నాయని ఆయయన అన్నారు. దేశ సంక్షేమం కోసం తన యావత్ జీవితాన్నే మోడీ అంకితం చేశారని, బలమైన, స్వయం సమృద్ధితో కూడిన భారతదేశ నిర్మాణానికి మోడీ శంకుస్థాపన చేశారని ఆయన పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర బలమైన నాయకత్వంలో భారతదేశం ఎన్నో విధాలుగా ప్రయోజనాలు సాధించిందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కూడా ప్రధాని నరేంద్ర మోడీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేశారు. మోడీ జన్మదినాన్ని సేవా దివస్గా పాటిస్తూ బిజెపి దేశవ్యాప్తంగా వారంరోజులపాటు పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తోంది.