కేరళ ప్రచారంలో ప్రియాంక గాంధీ
చాలకుడి(కేరళ): రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే గృహిణుల స్వావలంబన కోసం పెన్షన్ పథకాన్ని అమలు చేస్తుందని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా ప్రకటించారు. బుధవారం త్రిసూర్ జిల్లాలోని చాలకుడిలో ఆమె ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తూ గృహిణులు ఎదుర్కొనే సమస్యలు తనకు తెలుసునని, వారి సంక్షేమానికి తమ పార్టీ కట్టుబడి ఉంటుందని చెప్పారు. 47వ ఏట తాను రాజకీయ ప్రవేశం చేయడానికి ముందు వరకు తాను కూడా గృహిణిగా తన బాధ్యతలు నిర్వర్తించానని ఆమె తెలిపారు. పిల్లలను చూసుకోవడం, ఇంటిని చక్కదిద్దుకోవడం, వంట చేయడం వంటి పనులన్నీ తాను కూడా చేశానని ఆమె వివరించారు. ఏప్రిల్ 6న జరిగే కేరళ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ విడుదల చేసిన మ్యానిఫెస్టోలో గృహిణులకు నెలకు రూ.2,000 పెన్షన్, న్యాయ్ యోజన పథకం కింద పేదలకు సంవత్సరానికి రూ. 72,000 ఆర్థిక సహాయం వంటి హామీలిచ్చింది. గృహిణులను ఒక రాజకీయ పార్టీ గుర్తించడం ఇదే మొదటిసారని సభకు హాజరైన మహిళలను ఉద్దేశించి ప్రియాంక తెలిపారు. ఇద్దరు పిల్లల తల్లినైన తాను గృహిణిగా ఎన్నో గొప్ప విషయాలు నేర్చుకున్నానని 49 ఏళ్ల ప్రియాంక చెప్పారు.