మన తెలంగాణ/హైదరాబాద్: తనకు తల్లిదండ్రులతో విభేదాలు ఏర్పడ్డాయని అందువల్లే శిక్షణను మధ్యలోనే ఆపేసి లండన్ వెళ్లిపోయినట్టు వచ్చిన వార్తలను భారత బ్యాడ్మింటన్ స్టార్ పి.వి.సింధు ఖండించింది. తనకు కుటుంబ సభ్యులతో మనస్పర్థాలు తలెత్తాయని, అందుకే అలిగి విదేశాలకు వెళ్లిపోయినట్టు కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలను చూసి ఎంతో ఆవేదనకు గురయ్యానని పేర్కొంది. కుటుంబ సభ్యుల అనుమతితోనే తాను లండన్కు వెళ్లినట్టు సింధు స్పష్టం చేసింది. కొందరూ కావాలనే ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేశారని వాపోయింది. ఇక తనకు ప్రధాన కోచ్ పుల్లెల గోపీచంద్తో కూడా ఎలాంటి విభేదాలు లేవని తెలిపింది. గోపీచంద్ అంటే తనకు ఎంతో గౌరవమని పేర్కొంది. ఇక తాను ఎంతో ప్రేమించే తల్లిదండ్రుల గురించి కొందరూ అసత్య ప్రచారం చేయడం తనను ఎంతో బాధను కలిగించిందని తెలిపింది. ఈ మేరకు మంగళవారం సోషల్ మీడియాలో ఓ పోస్ట్ను పెట్టింది.