Friday, May 10, 2024

మెకానిక్ నిలదొక్కుకుంటే దేశానికి స్పీడ్ : రాహుల్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశంలోని మెకానిక్‌ల సాధికారత కీలకమని, దీనితో ఆటోమొబైల్ పరిశ్రమ బలోపేతం అవుతుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలిపారు. ఢిల్లీలోని కరోల్‌బాగ్‌లో కొందరు మోటారుసైకిల్ మెకానిక్‌లతో ఇటీవల జరిపిన ఇష్టాగోష్టిని తెలిపే వీడియోను రాహుల్ ఆదివారం వెలువరించారు. వీరితో భేటీ భారత్ జోడో యాత్ర తరువాతి తన కీలక మజిలీ అని రాహుల్ పేర్కొన్నారు. గత నెల 27న కరోల్‌బాగ్‌లో మెకానిక్‌లను కలిసిన సందర్భంగా ఆయన బైక్ మరమ్మతుల్లోని చిక్కులను తెలుసుకున్నారు. వారు అడిగిన ప్రశ్నలకు బదులు ఇచ్చారు. మీరెప్పుడు పెళ్లి చేసుకుంటారని ఓ మెకానిక్ ప్రశ్నించారు. దీనికి చూద్దాం అని రాహుల్ బదులిచ్చారు.

అక్కడి మెకానిక్‌లు ఉమెద్ షా, విక్కీ సేన్, మనోజ్‌పాశ్వాన్‌తో కలిసి ఆయన ఓ బైక్ సర్వీసు చేశారు. ముందు దేశంలోని మెకానిక్‌ల ఆర్థిక పరిస్థితి బాగుపడాల్సి ఉంది. వారు నిలదొక్కుకుంటే దేశం సంబంధిత బైక్ పరిశ్రమ బాగుపడుతుందన్నారు. ఇక్కడ తాను ఆరితేరిన బైకర్లను కలిసినట్లు రాహుల్ తెలిపారు. వీరు కష్టపడి పనిచేసే వారు, వీరితోనే భారతదేశ యాత్ర సజావుగా సాగుతోందని స్పందించారు. వారి కలలు, కష్టాలు ఏమిటనేది తెలుసుకునేందుకు తాను యత్నించినట్లు చెప్పారు. పేదరికంతో తాను చదువు మధ్యలోనే ఆపేసి మెకానిక్ అయినట్లు ఉమెద్ చెప్పినట్లు రాహుల్ వివరించారు. భారత్ జోడో యాత్రలో రాహుల్ వివిధ వర్గాలతో మమేకం అయ్యారు. ప్రత్యేకించి శ్రామికవర్గం సమస్యల గురించి తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆయన ఇక్కడి వాహనాల పనివారితో మాట్లాడారని కాంగ్రెస్ పార్టీ ఓ ప్రకటన వెలువరించింది.
నాకో కెటిఎం బైక్ ఉంది..ఏం లాభం తీయలేను నడపలేను
మెకానిక్‌లతో ముచ్చట్లలో రాహుల్ బాధ
తనకు బైక్ నడపడటం అంటే చాలా ఇష్టమని మెకానిక్‌లకు రాహుల్ తెలిపారు. తనకు సొంతంగా ఓ కెటిఎం 390 మోటారు సైకిల్ ఉంది. ఎప్పుడైనా దీనిని తీసుకుని వెళ్లి చక్కర్లు కొట్టిరావాలనే సరదా ఉంది. అయితే ఇందుకు తన సెక్యూరిటీ వ్యక్తులు ససేమిరా అంటారని, దీనితో ఇది ఇప్పుడు తన నివాసం బయటే ఉందని , అటూ ఇటూ పోతూ ఉంటే వస్తూ ఉంటే ఈ బైక్ అదేపనిగా తనను చూసినట్లు అన్పిస్తుంటుందని రాహుల్ జోక్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News