Saturday, May 4, 2024

భట్టిని సత్కరించనున్న రాహుల్ గాంధీ..!

- Advertisement -
- Advertisement -

పీపుల్స్ మార్చ్ పేరుతో సిఎల్పి నేత భట్టి విక్రమార్క విజయవంతంగా సాగించిన పాదయాత్ర ముగింపు సభ చరిత్రలో నిలిచిపోనుంది. భట్టి పాదయాత్ర వలన పార్టీలో సైలెంట్ సునామీగా మారింది. కేడర్ లో జోష్ పెంచింది. ఎన్నికల వేళ సమరానానికి సైన్యంలో పోరాట కసిని పెంచింది. దీనిని గుర్తించిన హైకమాండ్ భట్టికి అరుదైన గౌరవం అందిస్తోంది. ఖమ్మం గడ్డపైన లక్షలాది మంది కార్యకర్తల సమక్షంలో భట్టిని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ పార్టీ తరపున సత్కరించనున్నారు. ఇదే సభలో ముఖ్య నేతల చేరికలు తెలంగాణ భవిష్యత్ పై భరోసా ఇస్తూ ఎన్నికల సమరశంఖం పూరించేందుకు ఖమ్మం జనగర్జన వేదికగా నిలవనుంది.

ఒక్క తెలంగాణలోనే కాదు…కాంగ్రెస్ పార్టీలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు వినిపిస్తున్న పేరు మల్లు భట్టి విక్రమార్క. దక్షిణాదిని కర్ణాటక తరువాత కాంగ్రెస్ నాయకత్వం ఫోకస్ చేసిన రాష్ట్రం తెలంగాణ. తెలంగాణ ఇచ్చిన రాష్ట్రంగా కాంగ్రెస్ కు అధికారం దక్కాలి…రాహుల్ ప్రధాని కావాలి. ఈ రెండు అంశాలే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాల పై ప్రజల మధ్య నుంచే భట్టి నిలదీసారు. వారికి అండగా నిలిచారు. అన్ని వర్గాల ప్రజలతో మమేకం అయ్యారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా.. అనారోగ్య సమస్యలు తలెత్తినా వెనుకడుగు వేయలేదు. ఈ యాత్రతో నేతలందరు ఏకం అయ్యారు. కాంగ్రెస్ శ్రేణులు తరలి వచ్చారు. అగ్ర నేతలు సంఘీభావం ప్రకటించారు. ప్రజలు మద్దతుగా నిలిచారు. అందుకే ఇప్పుడు భట్టి పీపుల్స్ మార్చ్ కు ఇంత పాపులారిటీ వచ్చింది.

భట్టి యాత్ర ద్వారా తెలంగాణ కాంగ్రెస్ లో వచ్చిన మార్పును హైకమాండ్ గుర్తించింది. దీంతో భట్టి యాత్రకు సరైన గుర్తింపు ఇవ్వాలని నిర్ణయించింది. ఇదే సమయంలో పార్టీలో ముఖ్యుల చేరికల పైన భట్టి చేసిన ప్రయత్నాలు సఫలం అయ్యాయి. అన్నింటికీ సరైన వేదిక ఖమ్మంగా నిర్ణయించారు. ఇక్కడ నుంచే పార్టీ నేత రాహుల్ గాంధీ తెలంగాణ పైన తమకున్న అభిమానం చాటుతూ..భవిష్యత్ లో ఏ విధంగా తెలంగాణ కోసం ఎటువంటి నిర్ణయాలు అమలు చేసేది ప్రకటించనున్నారు. ఇక్కడ నుంచే బీఆర్ఎస్ ప్రభుత్వం పై గర్జనకు సిద్ధమయ్యారు. ఈ సభకు జనగర్జనగా పేరు ఖరారు చేసారు.

ఖమ్మం సభ ఏర్పాట్ల పైన భట్టితో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ థాక్రే చర్చించారు. పార్టీలో చేరనున్న మాజీ ఎంపీ పొంగులేటిని సమావేశానికి ఆహ్వానించారు. ఖమ్మం సభ వంద ఎకరాల్లో నిర్వహించేలా కసరత్తు ప్రారంభించారు. భట్టి చారిత్రాత్మక యాత్ర ముగింపు సభగా.. పొంగులేటి చేరిక వేదికగా ఈ సభను నిర్వహించేందుకు నిర్ణయించారు. ఈ సభ ద్వారా కాంగ్రెస్ తెలంగాణ ప్రజల కోసం ఏం చేయనుందో స్పష్టత ఇవ్వనున్నారు. ఖమ్మం సభకు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు తరలి వస్తున్నారు. కాంగ్రెస్ ప్రభంజనం ఖమ్మం నుంచే మొదలు కానుంది. కర్ణాటక ఎన్నికల్లో విజయం తరువాత ఇప్పుడు కాంగ్రెస్ వరుస నిర్ణయాలతో దేశ వ్యాప్తంగా అందరి చూపు ఖమ్మం జనగర్జన సభ వైపే చూస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News