అధికారులు వేధిస్తున్నారని ఆరోపణ
మనతెలంగాణ, హైదరాబాద్ : అధికారులు వేధింపులకు గురిచేస్తున్నారని ఓ ఆర్టిసీ డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన నగరంలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. రాణిగంజ్ ఆర్టిసి డిపోలో డ్రైవర్గా విధులు నిర్వర్తిస్తున్న తిరుపతి రెడ్డి అధికారులు వేధింపులకు గురిచేస్తున్నారని క్రిమిసంహారక మందు తాగాడు. నెల నుంచి అధికారులు తనను విధుల్లోకి తీసుకోకుండా వేధింపులకు గురిచేస్తున్నారని గత కొంత కాలం నుంచి తోటి డ్రైవర్లతో చెప్పుకుంటూ ఆవేదన చెందే వాడు. ఈ క్రమంలోనే రాణిగంజ్ ఆర్టిసి డిపోకు వచ్చిన తిరుపతి రెడ్డి ఒక్కసారిగా క్రిమిసంహారక మందు తాగాడు. ఇది గమనించి తోటి ఉద్యోగులు వెంటనే ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.