‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో హీరోయిన్గా తెలుగు వారికి పరిచయమైన ముద్దుగుమ్మ రాశిఖన్నా. ఈ అమ్మడు వరుసగా తెలుగులో యంగ్ హీరోలకు జోడీగా నటిస్తూ వస్తోంది. ఆశించిన స్థాయిలో సూపర్ హిట్లు పడక పోవడం వల్ల ఆమెకు స్టార్ హీరోల సినిమాల్లో నటించే ఆఫర్లు రావడం లేదు. ఎన్టీఆర్తో ‘జై లవ కుశ’ సినిమాలో నటించినా ఆతర్వాత పెద్ద సినిమాల ఆఫర్లు మాత్రం రాలేదు. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళంలో కూడా నటిస్తున్న ఈ అమ్మడు సోమవారం తన బర్త్డేను జరుపుకుంది. పుట్టిన రోజు సందర్భంగా రాశిఖన్నా కొన్ని ఆసక్తికర విషయాలను తెలియజేసింది. “ఢిల్లీలో పుట్టి పెరిగిన నాకు చిన్నప్పటి నుండి చదువుపై ఎంతో ఆసక్తి ఉండేది. ఐఏఎస్ కావాలనే కోరికతో ఒకానొక సమయంలో పుస్తకాల పురుగులా మారాను. చాలా చదివాను. కానీ నా ఆలోచన ఆ తర్వాత మారింది. నాకు 17 ఏళ్ల వయసు ఉన్న సమయంలో ఒక సీనియర్ వచ్చి లవ్ ప్రపోజ్ చేశాడు. కొన్నాళ్ల పాటు అతడితో లవ్ ట్రాక్ నడిచింది. కానీ చాలా తక్కువ సమయంలోనే అతడితో బ్రేకప్ అయింది”అని రాశిఖన్నా చెప్పుకొచ్చింది.