గౌతం గంభీర్
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా వరుస పరాజయాలు చూడడంతో కెప్టెన్ విరాట్ కోహ్లిపై మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డాడు. భారత్ సిరీస్ కోల్పోవడానికి కోహ్లి పేలవమైన కెప్టెన్సీనే కారణమని విమర్శించాడు. బౌలర్లను ఎలా వాడాలో కూడా విరాట్కు అర్థం కావడం లేదని, అలాంటి వ్యక్తి కెప్టెన్గా ఉంటే ఇలాంటి ఫలితాలే వస్తాయని తీవ్రంగా విమర్శించాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో సందర్భాన్ని బట్టి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని, అయితే కొంత కాలంగా కోహ్లి దీనిలో ఘోరంగా విఫలమవుతున్నాడన్నాడు. జట్టును ముందుండి నడిపించడంలో కోహ్లి వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుందన్నాడు. ఇప్పటికైన విరాట్ తన కెప్టెన్సీని మెరుగు పరుచుకోవాల్సిన అవసరం ఉందన్నాడు. ఇక వరుసగా రెండో మ్యాచ్లో కూడా భారత బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకోవడం ఆందోళన కలిగించే పరిణామమన్నాడు.
నవ్దీప్ సైని, చాహల్లతో పాటు కీలక బౌలర్ బుమ్రా కూడా భారీగా పరుగులు ఇచ్చుకోవడం జట్టుకు ప్రతికూలంగా మారిందన్నాడు. ఇక బుమ్రా వంటి అగ్రశ్రేణి బౌలర్ సేవలను కోహ్లి సరిగ్గా వినియోగించుకోవడం లేదన్నాడు. మరోవైపు తొలి మ్యాచ్లో భారీగా పరుగులు ఇచ్చుకున్న సైనిని మళ్లీ తుది జట్టులోకి తీసుకుని కోహ్లి పెద్ద పొరపాటు చేశాడని విమర్శించాడు. సైనికి బదులు శార్దూల్ను తీసుకుని ఉంటే ఫలితం మరోలా ఉండేదన్నాడు. అంతేగాక హార్దిక్ను బౌలర్గా సరిగ్గా ఉపయోగించుకోలేక పోయాడని, ముందుగానే అతనికి బంతి అప్పగిస్తే జట్టుకు ప్రయోజనంగా ఉండేదని గంభీర్ అభిప్రాయపడ్డాడు.