కర్నాటక హైకోర్టుకు తెలిపిన ట్విటర్ ఇండియా ఎండి
బెంగళూరు : తనను అరెస్ట్ చేయరని హామీ ఇస్తే ఉత్తరప్రదేశ్ పోలీసుల ఎదుటకు వస్తానని సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్ ఇండియా ఎండి మనీశ్ మహేశ్వరి మంగళవారం కర్నాటక హైకోర్టుకు తెలిపారు. ఘజియాబాద్లో ఓ ముస్లిం వృద్ధుడిపై దాడి చేసిన వీడియో వైరల్ కావడంతో మనీష్ మహేశ్వర్పై యూపీ ఘజియాబాద్ పోలీసులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మనీష్ మహేశ్వర్ ఈ నోటీసులకు వ్యతిరేకంగా కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా మనిష్ మహేశ్వర్ ‘పోలీసులు నాపై చేయి వేయబోమని కోర్టుకు అండర్టేకింగ్ ఇస్తే నేను వ్యక్తిగతంగా పోలీసులు ఎదుట హాజరు కావడానికి సిద్ధంగా ఉన్నాను అని తెలిపారు. ఇక ముస్లిం వృద్ధుడిపై దాడి చేసిన వీడియో మత ఘర్షణలను ప్రేరేపించేలా ఉందంటూ ట్విట్టర్ ఎండీ మనీశ్కు ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ పోలీసులు కొద్ది రోజుల క్రితం నోటీసులిచ్చారు. తమ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. అయితే, తాను వర్చువల్ పద్ధతిలో హాజరవుతానని మనీశ్ జవాబివ్వగా అందుకు ఘజియాబాద్ పోలీసులు నిరాకరించారు.