న్యూఢిల్లీ : ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులతో సహా రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయాలని జమ్మూకశ్మీర్లో ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. జమ్మూకశ్మీర్కు ప్రత్యేక హోదాను కల్పించిన ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేసిన తర్వాత 2019 ఆగస్ట్ నుంచి నాయకులు నిర్బంధంలో ఉన్నారు. ‘ప్రజాస్వామిక కట్టుబాట్లు, ప్రాథమిక హక్కులు, పౌర హక్కులపై దాడులు పెరుగుతున్నాయి’ అని ప్రతిపక్ష నాయకులు ఒక సంయుక్త ప్రకటనలో ఆరోపించారు. ‘ఫలితంగా అసమ్మతిని అణచి వేయడం మాత్రమే కాదు… విమర్శించే అవకాశాలు లేకుండా ఒక పద్ధతిప్రకారం గొంతుకల్ని కూడా నొక్కేస్తున్నారు.
హీనమైన కారణాలతో ముగ్గురు జమ్మూకశ్మీర్ మాజీ సిఎంలను ఏడు నెలలకు పైగా నిర్బంధంలో ఉంచారంటే ఇంతకంటే మొరటైన ఉదాహరణ ఉండదు’ అని ఆ ప్రకటనలో ప్రతిపక్ష నాయకులు విరుచుకు పడ్డారు. ‘ఈ ముగ్గురు నాయకులు జమ్మూకశ్మీర్ ప్రజల భద్రతకు ముప్పు కలిగిస్తున్నారని కానీ, వారి కార్యకలాపాలవల్ల జాతి ప్రయోజనాలకు హాని కలుగుతుందని కానీ మోడీ ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నిరూపించే ఆధారాలేవీ లేవు. ఆత్మరక్షణకోసమే కేంద్రం అలాంటి ప్రచారం చేస్తోంది ’ అని ప్రతిపక్ష నాయకులు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సి) నాయకులు, జెకె మాజీ సిఎంలు ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీ (పిడిపి) చీఫ్, మాజీ సిఎం మెహబూబా ముఫ్తీలను ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టం కింద శ్రీనగర్లో వారి ఇళ్లలో నిర్బంధించి ఉంచారు.