Sunday, April 28, 2024

రాష్ట్ర సాధనలో జైపాల్‌రెడ్డి పాత్ర చాలా కీలకమైనది: రేవంత్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర అభివృద్ధిలో జైపాల్‌రెడ్డి పాత్ర చాలా కీలకమైందని టిపిసిసి అధ్యక్షులు, ఎంపి రేవంత్‌రెడ్డి అన్నారు. నెక్లెస్‌రోడ్డులో మాజీ కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి రెండో వర్థంతి సందర్భంగా రేవంత్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్లు గీతారెడ్డి, అంజన్‌ కుమార్ యాదవ్, ఎఐసిసి కార్యదర్శి వంశీచంద్‌రెడ్డి, మాజీ మంత్రి వినోద్, సురేష్ సెట్కార్ తదితరులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం సర్వే చేయించి పాలమూరు సస్యశ్యామలం కావడానికి పునాదులు వేసింది జైపాల్‌రెడ్డి అని అన్నారు. హైదరాబాద్‌లో మెట్రో రైలు రావడానికి కారణం జైపాల్‌రెడ్డి కృషేనని రేవంత్ తెలిపారు. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రిగా, పట్టణాభివృద్ధి మంత్రిగా ఆయన చేసిన సేవలు మరువలేనివన్నారు. రాష్ట్ర సాధనలో జైపాల్‌రెడ్డి పాత్ర చాలా కీలకమైందని రేవంత్ తెలిపారు. సోనియాగాంధీ మాటనే ఫైనల్ అని చెప్పి ఆమెను ఒప్పించి తెలంగాణ రాష్ట్ర సాధన అయ్యేలా చేసిన గొప్ప నాయకులు జైపాల్‌రెడ్డి అని రేవంత్ కొనియాడారు. జైపాల్‌రెడ్డి ఆశయాలు, సిద్ధాంతాలు రాష్ట్రంలో ఆచరించి అభివృద్ధి చేయాలన్నారు. జైపాల్‌రెడ్డి రాష్ట్రంలో పివి నరసింహారావు తర్వాత మాట్లాడుకోవాల్సిన మహనీయులు, గొప్ప వైతాళికులు అని రేవంత్ కీర్తించారు. రాష్ట్ర కాంగ్రెస్ సైనికులుగా సోనియాగాంధీని నమ్మకాన్ని నిలబెట్టి పార్టీని అధికారంలోకి తెచ్చి సోనియమ్మ రాజ్యం ఏర్పాటు చేస్తామని రేవంత్‌రెడ్డి అన్నారు.
జైపాల్‌రెడ్డికి భారతరత్న ఇవ్వాలి: మల్లు రవి
జైపాల్‌రెడ్డికి భారతరత్న ఇవ్వాలని మల్లు రవి డిమాండ్ చేశారు. విద్యార్థి దశ నుండి జైపాల్‌రెడ్డి నైతిక విలువలతో రాజకీయాలు చేశారన్నారు. భారత రాజకీయాల్లో తనకంటూ ఒక ముద్ర వేసుకున్నారన్నారు. తెలంగాణ స్వరాష్ట్రం కొరకు జైపాల్‌రెడ్డి పాటుపడ్డారన్నారు.

Revanth Reddy tributes paid Jaipal Reddy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News