Sunday, April 28, 2024

పెరుగుతున్న చికెన్ ధరలు

- Advertisement -
- Advertisement -

గద్వాల : కోడి మాంసంతో భోజనాన్ని లొట్టలేసుకొని ఆరగించే మాంసాహార ప్రియులకు చికెన్ ధరలు మింగుడుపడటం లేదు. ప్రస్తుతం కోడి ధరలు మరింత పెరిగాయి. ఎండలు మండిపోతుండటంతో చికెన్ తినే వారి సంఖ్య తగ్గుతుంది. చికెన్ అంతగా డిమాండ్ ఉండదులే అనుకుంటే పొరపాటే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ ధరలు భగ్గుమంటున్నాయి. కిలో స్కిన్ లెస్ చికెన్ ధర రూ. 300 పలుకుతుండటంతో కోడి మాంసం ప్రియులు అవాక్కవుతున్నారు.

పది రోజుల కిందటి వరకు కిలో చికెన్ రూ. 220 నుంచి రూ. 240 ఉండగా ఇప్పుడు అది స్కీన్ లెస్ కిలో రూ. 300, విత్ స్కిన్ రూ. 280కి పెరుగుతుంది. దీంతో ఈ వేసవి చికెన్ ప్రియులకు షాకిస్తోంది. మార్కెట్‌లో ప్రస్తుతం లైవ్ బర్డ్‌కు కిలో రూ. 180కి విక్రయిస్తున్నారు. అంతకు ముందు ఈ ధర రూ. 120 గా ఉండేది. కాని ఏప్రిల్ 1న కిలో చికెన్ ధర రూ. 154గా ఉంది. వారం కిందట మార్కెట్‌లో స్కిన్‌తో కూడిన చికెన్ ధర కిలో రూ. 213గా, స్కిన్‌లెస్ రూ. 243గా ఉండేది. ఇప్పుడు ఆ ధర రూ. 300కు చేరింది. మటన్ ధరతో పొలిస్తే ఆ ధరలో 25 శాతం ధరకే కిలో చికెన్ వస్తుండటంతో మాంసాహారులు ఎక్కువగా చికెన్ తినేందుకే ఇష్టపడతారు. అయితే చికెన్ ధరలు పెరగడంతో కొనేందుకు వెనకాముందు ఆలోచించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

ఇక ఇంటికి బంధువులు వస్తే చికెన్ కొనాలంటే రూ. 1000 దాకా ఖర్చు చేయాల్సి వస్తోందని వినియోగదారులు వాపోతున్నారు. వేసవిలో విపరీతమైన ఎండలకు బయటకు వెళ్లాలంటేనే మనుషులు కూడా భయపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రోజు దాదాపు 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో కోళ్లు ఎండ వేడికి ప్రాణాలు వదులుతున్నాయి. కాని ధరలకు మాత్రం రెక్కలు వచ్చి పైపైకి పెరుగుతున్నాయి. సాధారణంగా వేసవి కాలంలో కోళ్ల ఫారాల్లో చికెన్ బ్యాచ్‌లను పెంపకందారులు తగ్గిస్తుంటారు. అదే సమయంలో ఎండలు విపరీతంగా పెరగడంతో పాటు వడగాలులకు కోళ్లు మృత్యువాతపడుతుండటంతో చికెన్ ధరలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి.

సాధారణంగా వేసవిలో 40 డిగ్రీల ఉష్ణోగ్రత దాటితే బ్రాయిలర్ కోళ్లు ఎండవేడిని తట్టుకోలేవు. కోళ్ల షెడ్లపై స్ప్రింకర్లతో రోజుకు 3 సార్లు చల్లబరచకపోతే ఎండ వేడికి చనిపోతాయి. ఈ పరిస్థితుల్లో స్ప్రింకర్లతో పాటు కూలర్లు పెట్టి మరీ కోళ్ల ఫాం నిర్వాహకులు షెడ్లలో చల్లదనాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అదే సమయంలో కరోనా మొదటి దశ తర్వాత కోళ్ల దాణా ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. కోడికి వేసే దాణాలో ప్కరధానంగా సోయ, మొక్కజొన్న ప్రధానమైనది. కరోనాకు ముందు కిలో సోయా రూ. 35కు లభించేది. ఇప్పుడు కిలో రూ. 105కు చేరింది.

ఇక రూ. 13కు కిలో లభించే మొక్కజొన్న దాణా ధర ఇప్పుడు రూ. 40కి చేరింది. దీంతో కోళ్ల పెంపకంలో ఉత్పత్తి ఖర్చు పెరిగిపోయింది. ఈ పరిస్థితుల్లో పెరిగిన దాణా ఖర్చులు, విపరీతమైన ఎండవేడికి కోళ్లు మృత్యువాతపడటం, ఎండవేడి నుంచి కోళ్లను కాపాడేందుకు కూలర్లు, ఏసిలు, స్ప్రింకర్లు వంటి ఉపకరణాల వినియోగంతో చికెన్ ఉత్పత్తి ఖర్చు పెరిగిపోయి చికెన్ ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News