Tuesday, May 7, 2024

బిజెపిలో చేరిన కాంగ్రెస్ నేత ఆర్‌పిఎన్ సింగ్ …

- Advertisement -
- Advertisement -

మోడీ కలల సాకారానికే అని ప్రకటన

RPN Singh joins BJP

న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి ఆర్‌పీఎన్ సింగ్ బీజేపీలో మంగళవారం చేరారు. న్యూఢిల్లీ లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి ఆయన మంగళవారం రాజీనామా చేయడం, ఆ తరువాత కొద్ది సేపటికే ఆయన బీజేపీలో చేరడం
వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. పార్టీలో చేరిన అనంతరం మీడియాతో ఆర్‌పీఎన్ సింగ్ మాట్లాడుతూ ఒకే పార్టీ (కాంగ్రెస్) లో తాను 32 ఏళ్లు ఉన్నానని, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ గతంలో మాదిరి లేదని వ్యాఖ్యానించారు. ఇండియా కోసం ప్రధాని మోడీ కన్న కలలు సాకారం చేయడం కోసం బీజేపీలో ఒక కార్యకర్తలా పనిచేస్తానని పేర్కొన్నారు.
కాంగ్రెస్‌కు బిగ్ షాక్ .. ఆర్‌పిఎన్ సింగ్ రాజీనామా
దీనికి ముందు ఆర్‌పీఎన్ సింగ్ ఓ ట్వీట్‌లో రిపబ్లిక్ డే ఫార్మేషన్ రోజే నేను నా రాజకీయ ప్రయాణంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాను. జై హింద్ అంటూ పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకత్వం పై ఆయన అసంతృప్తితో ఉన్నారని, కనీసం తన సన్నిహితులకు కూడా యూపీ ఎన్నికల్లో పార్టీ టికెట్లు ఇవ్వలేదంటూ మనస్తాపానికి గురయ్యారని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఆర్‌పీఎన్ సింగ్ 1996 నుంచి 2007 వరకు షడ్రౌనా ఎమ్‌ఎల్‌ఎగా ఉన్నారు. అనంతరం కుషీనగర్ నుంచి ఎంపీగా ఎన్నికై కేంద్రంలో హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 2014 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమిని చవి చూశారు. ఆసక్తికరంగా , యూపీ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 30 మంది స్టార్ క్యాంపెయినర్లలో ఆర్‌పీఎన్ సింగ్ కూడా ఉన్నారు. ఆర్‌పిఎన్‌తో కలిపి ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ ముగ్గురు పెద్ద నాయకులను కోల్పోయింది. 2019 లో ప్రియాంకతోపాటు ఉత్తరప్రదేశ్ ఇంఛార్జీ బాధ్యతలు తీసుకున్న జ్యోతిరాదిత్య సిందియా, యూపీలో బ్రాహ్మణులకు పెద్ద దిక్కుగా కనిపించే జితిన్ ప్రసాద్, ఇప్పటికే బీజేపీలో చేరారు. కాగా తాజాగా ఆర్‌పిఎన్ పార్టీ వీడారు. ఓబీసీ సామాజిక వర్గంలో ముఖ్యనాయకుల్లో ఒకరైన ఆర్‌పిఎన్ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు మొదటి విడత పోలింగ్‌కి రెండు వారాల ముందు పార్టీ ఫిరాయించడం కాంగ్రెస్‌కు తీవ్ర నష్టం కలిగిస్తుందని అంటున్నారు. అయితే కొద్ది రోజులుగా ఓబీసీ నేతలు వరుసపెట్టి బీజేపీని వీడుతున్న సమయంలో ఆర్‌పీఎన్ బీజేపీలో చేరడం గమనార్హం.

పిరికిపంద ఆర్‌పిఎన్ సింగ్ : ప్రియాంక ఫైర్
లఖ్‌నవూ : కాంగ్రెస్ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి ఆర్‌పిఎన్ సింగ్ బీజేపీలో చేరడంపై కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రా తీవ్ర స్థాయిలో స్పందించారు. పిరికిపందలు పోరాటం చేయలేరంటూ ప్రియాంక ఘాటుగా స్పందించారు. కాగా, ఆర్‌పీఎన్ పార్టీ పిరాయింపుపై స్పందిస్తూ కాంగ్రెస్ చేస్తున్న పోరాటం సాహసంతో కూడుకొని ఉంటుంది. ఈ పోరాటం చేయాలంటే ఎంతో శక్తి, ధైర్యం కావాలి. పిరికిపందలు ఈ పోరాటం చేయలేరని ప్రియాంక వ్యాఖ్యానించారు.

పిరికి పందలే విరుద్ధమైన భావజాలం ఉన్న పార్టీల్లో చేరతారు
ఆర్‌పీఎన్ సింగ్ రాజీనామాపై కాంగ్రెస్ వ్యాఖ్య
న్యూఢిల్లీ : కేంద్ర మాజీ మంత్రి ఆర్‌పీఎన్ సింగ్ రాజీనామాపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. కేవలం పిరికిపందలే విరుద్ధమైన భావజాలం ఉన్న పార్టీల్లో చేరతారని ఆ పార్టీ జాతీయ ప్రతినిధి సుప్రియ శ్రినాటే వ్యాఖ్యానించారు. బీజెపీ , కాంగ్రెస్ మధ్య సిద్ధాంత పోరాటం సాగుతుందని, ఈ పోరులో విజయం సాధించాలంటే మనం ధైర్యంగా అడుగువేయాలని, కేవలం పిరికిపందలే పూర్తి విరుద్ధమైన సిద్ధాంతాలున్న పార్టీల్లో చేరతారని ఆమె పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News