Sunday, April 28, 2024

సెప్టెంబర్ 8న ‘రూల్స్ రంజన్’ చిత్ర ట్రైలర్ విడుదల

- Advertisement -
కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా రత్నం కృష్ణ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘రూల్స్ రంజన్’. సుప్రసిద్ధ నిర్మాత ఏ.ఎం. రత్నం సమర్పణలో స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై దివ్యాంగ్ లవానియా, మురళి కృష్ణ వేమూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రింకు కుక్రెజ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అమ్రిష్ గణేష్ సంగీతం అందిస్తున్నారు. అతి కొద్ది కాలంలోనే యువతకి ఎంతగానో చేరువైన నాయకానాయికలు కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి కలయికలో వస్తున్న సినిమా కావడంతో ‘రూల్స్ రంజన్’పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ‘నాలో నేనే లేను’, ‘సమ్మోహనుడా’, ‘ఎందుకురా బాబు’ పాటలు ఒక దానికి మించి ఒకటి అన్నట్లుగా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని సినిమాపై అంచనాలను పెంచేశాయి.
సోమవారం(సెప్టెంబర్ 4న) మీడియా సమావేశం నిర్వహించిన చిత్ర బృందం సినిమా విడుదల తేదీని ప్రకటించింది. ఈ సినిమాని సెప్టెంబర్ 28న విడుదల చేస్తున్నట్లు ఏ.ఎం. రత్నం చేతుల మీదుగా విడుదల తేదీని వెల్లడించారు. అలాగే ఈ సందర్భంగా మీడియా కోసం ప్రత్యేకంగా నాలుగో పాటని ప్రదర్శించారు. గత మూడు పాటల్లాగే నాలుగో పాట కూడా కట్టిపడేసింది. ‘రూల్స్ రంజన్’ నుంచి విడుదలవుతున్న ఒక్కో పాట సినిమాపై అంచనాలను ఆకాశాన్నంటేలా చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్.
‘రూల్స్ రంజన్’ చిత్ర ట్రైలర్ ను సెప్టెంబర్ 8న ఉదయం 11:22 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలుపుతూ ఒక కొత్త పోస్టర్ ను వదిలారు. పోస్టర్ లో కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి లుక్స్ ఆకట్టుకుంటున్నాయి. అసలే కిరణ్ అబ్బవరం-నేహా శెట్టి కలయికలో వస్తున్న సినిమా, పైగా పాటలు పెద్ద హిట్ అయ్యాయి. దానికి తోడు సినిమా విడుదల తేదీ సందర్భంగా చిత్ర బృందం మాట్లాడిన మాటల్లో ఈ సినిమా పట్ల ఉన్న నమ్మకం చూస్తుంటే.. ఘన విజయం సాధించడం ఖాయమనిపిస్తోంది. రోజురోజుకి అంచనాలు పెరుగుతూ ప్రస్తుతం ఈ సినిమాపై నెలకొన్న బజ్ తో.. ట్రైలర్ ఎలా ఉండబోతోందనే ఆసక్తి అందరిలో నెలకొంది.
కథానాయకుడు కిరణ్ అబ్బవరం గత చిత్రాలకు, ఇమేజ్ కు భిన్నంగా ఈ చిత్రం సరికొత్తగా ఉండటంతో పాటు, పూర్తి స్థాయి వినోద భరితంగా ఉంటుందని చిత్ర నిర్మాతలు తెలిపారు. భావోద్వేగాలు, ప్రేమ, హాస్యం, అద్భుతమైన సంగీతం కలగలిసిన ఈ విందుభోజనం లాంటి చిత్రం కుటుంబ ప్రేక్షకులను, యువతను ఆకట్టుకుని ఘన విజయం సాధిస్తుందని చిత్రబృందం నమ్మకం వ్యక్తం చేసింది.
వెన్నెల కిషోర్, హైపర్ ఆది, వైవా హర్ష, నెల్లూరు సుదర్శన్, సుబ్బరాజు, అజయ్, గోపరాజు రమణ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. అన్నూ కపూర్, సిద్ధార్థ్ సేన్, అతుల్ పర్చురే, విజయ్ పాట్కర్, మకరంద్ దేశ్‌పాండే, అభిమన్యు సింగ్ మరియు గుల్షన్ పాండే సహా పలువురు హిందీ నటులు కూడా రూల్స్ రంజన్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా దులీప్ కుమార్, ఆర్ట్ డైరెక్టర్ గా ఎం. సుధీర్ వ్యవహరిస్తున్నారు.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News