Wednesday, May 8, 2024

ఉక్రెయిన్ యుద్ధానికి 500 రోజులు..

- Advertisement -
- Advertisement -

కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య చేపట్టి శనివారంతో 500రోజులు పూర్తయ్యాయి.గత ఏడాది ఫిబ్రవరి 24న ‘ ప్రత్యేక మిలిటరీ ఆపరేషన్’ పేరిట రష్యా దాడులు మొదలుపెట్టినా ఇప్పటికీ యుద్ధం ముగింపు దిశగా ఎలాంటి సంకేతాలు కనబడడం లేదు. మరో వైపు రష్యా భీకర దాడులతో ఉక్రెయిన్ లో ఆస్తి, ప్రాణ నష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. మొదట్లో రష్యా దూకుడు కనబరిచినా ఆ తర్వాత ఉక్రెయిన్ పశ్చిమ దేశాల సాయంతో ఎదురు దాడులకు దిగుతోంది. తమ భూభాగాలను రక్షించుకోవడానికి గట్టిగా పోరాడుతూనే ఉంది. ఇన్ని రోజులగా రష్యా సేనలను తీవ్రంగా ప్రతిఘటిస్తున్న ఉక్రెయిన్ సైనికుల ధైర్య సాహసాలను ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ ప్రశంసించారు.

రష్యా ఆక్రమణనుంచి ఉక్రెయిన్ సేనలు విముక్తం చేసిన నల్లసముద్రంలోని స్నేక్ ఐలాండ్‌నుంచి జెలెన్‌స్కీ ప్రసంగిస్తూ దీవి విముక్తి కోసం పోరాడిన సైనికులను, ఉక్రెయిన్‌లోని మిగతా బలగాలను పొగడ్తలతో ముంచెత్తారు. ఉక్రెయిన్ తన భూభాగంలోని ప్రతి అంగుళాన్ని తిరిగి దక్కించుకుంటుందనడానికి ఈ దీవిపై పట్టును తిరిగి దక్కించుకోవడమే నిదర్శనమని ఆయన అన్నారు.‘ ఈ 500 రోజులుగా పోరాటం జరుపుతున్న ప్రతి సైనికుడికి విజయానికిసంకేతమయిన ఈ ప్రదేశంనుంచి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’ అని ఆయన అన్నారు. ఉక్రెయిన్ కోసం పోరాడుతున్న ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్’ అని ఆయన అన్నారు. ఉక్రెయిన్‌పై దాడి చేసిన తొలి రోజయిన గత ఏడాది ఫిబ్రవరి 24నే రష్యా నల్ల సముద్రంలోని చిన్న దీవి అయిన స్నేక్ ఐలాండ్‌ను తన అధీనంలోకి తెచ్చుకుంది.

ఉక్రెయిన్‌లోని అతి పెద్ద రేవు, ఆ దేశ నౌకాదళ ప్రధాన కేంద్రమైన ఒడేసాపై దాడులు చేయడానికి ఈ దీవిని ఉపయోగించుకోవచ్చన్న అంచనాలతో దీన్ని స్వాధీనం చేసుకుంది. అయితే ఆ తర్వాత ఉక్రెయిన్ ఈ దీవిలోని రష్యా సైనిక స్థావరంపై స్థాయిలో బాంబుల వర్షం కురిపించడంతో రష్యా జూన్ 30న ఆ దీవిని వదిలిపెట్టాల్సి వచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News