Wednesday, May 1, 2024

చంద్రుడిపై అడుగు పెట్టడానికి ముందే కూలిపోయిన రష్యా ల్యాండర్ లూనా 25

- Advertisement -
- Advertisement -

మాస్కో: చంద్రుడిపై పరిశోధనల కోసం రష్యా ప్రయోగించిన లూనా 25 ప్రయోగం విఫలమైంది. జాబిల్లిపై అడుగు పెట్టడానికి ముందే ల్యాండర్ కుప్పకూలి పోయింది. రష్యా అంతరిక్ష సంస్థ “రోస్‌కాస్మోస్‌” ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది. అనియంత్రిత కక్షలో పరిభ్రమించిన అనంతరం అది కూలిపోయినట్టు తెలిపింది. దీంతో దాదాపు 50 ఏళ్ల తరువాత చంద్రుడి పైకి చేరాలనుకున్న రష్యా కల చెదిరినట్టయ్యింది.

‘జాబిల్లి సమీపం లోకి వెళ్లిన ల్యాండర్ , అనియంత్రిత కక్షలో పరిభ్రమించింది. అనంతరం చంద్రుడి ఉపరితలాన్ని ఢీకొట్టి కుప్పకూలిపోయింది.” అని రష్యా అంతరిక్ష సంస్థ రోస్‌కాస్మోస్ ప్రకటించింది. ఇలా 47 ఏళ్ల తర్వాత జాబిల్లిపై పరిశోధనల కోసం రష్యా పంపిన ఈ ల్యాండర్ 21 వ తేదీన దక్షిణ ధ్రువంపై దిగేందుకు సిద్ధమయ్యింది. ఈ క్రమం లోనే ల్యాండింగ్‌కు ముందు కక్ష (ప్రీ ల్యాండింగ్ ఆర్బిట్)కు చేరడానికి లూనా 25 శనివారం కీలక విన్యాసాన్ని చేపట్టింది. ఆ ప్రయత్నంలో వ్యోమనౌక లోని ఆటోమేటిక్ స్టేషన్‌లో అత్యవసర పరిస్థితి తలెత్తినట్టు రోస్‌కాస్మోస్ గుర్తించింది.

అప్పటికే వ్యోమనౌకతో సంబంధాలు తెగిపోయినట్టు తెలిపింది. ఇదిలా ఉంటే లూనా 25 ని ఈ నెల 11న రష్యా లోని వోస్తోక్నీ కాస్మోడ్రోమ్ నుంచి ప్రయోగించారు. దాదాపు పదిరోజుల పాటు ప్రయాణించిన ల్యాండర్ , కొన్ని గంటల క్రితమే చంద్రుడి ఫోటోలనూ పంపించింది. మరికొన్ని గంటల్లోనే అక్కడ దిగేందుకు సిద్ధమైన సమయంలో అది క్రాష్ అయ్యింది. మరోవైపు భారత్ ప్రయోగించిన చంద్రయాన్ 3 , ఈనెల 23 సాయంత్రం చంద్రుడి దక్షిణ ధ్రువానికి చేరువ లోని ప్రదేశంలో దిగనుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News