హైదరాబాద్: నగరంలో మణికొండ మునిసిపాలిటీ పరిధిలోని పుప్పాల్ గూడ గోల్డెన్ టెంపుల్ చౌరస్తా వద్ద పందేన్ వాగులో గల్లంతైన వ్యక్తి సహాయక చర్యలను రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరిశీలించారు. ఆదివారం అడిషనల్ కలెక్టర్ ప్రతిక్ జైన్ తో కలిసి మంత్రి సబితా రెడ్డి ప్రమాదం స్థలాన్ని పరిశీలించారు. శనివారం రాత్రి గల్లంతైన వ్యక్తి ఆచూకీ ఇప్పటివరకు లభించకపోవడంతో మరింత ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టి త్వరితగతిన ఆచూకీ కనుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. నిన్న సంఘటన జరిగినప్పటి నుండి డీఆర్ఎఫ్, మున్సిపల్ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ”డ్రైనేజి పనులు జరుగుతున్నప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరుగకుండా బారికేడ్లు, సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలి. వర్షాల నేపథ్యంలో అన్ని మునిసిపాలిటీలలో పనులు జరుగుతున్న చోట తగు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు.
Sabitha Reddy visits Incident place in Manikonda