Sunday, April 28, 2024

గెహ్లోట్‌పై మళ్లీ యుద్ధం ప్రకటించిన పైలట్

- Advertisement -
- Advertisement -

జైపూర్: రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు చేరువవుతున్న వేళ అధికార కాంగ్రెస్ అసమ్మతి నేత సచిన్ పైలట్ అటు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్, ఇటు పార్టీ అధినేతలకు సవాలు విసురుతూ గురువారం అజ్మీర్‌ నుంచి జైపూర్ దాకా 125 కిలోమీటర్ల పాదయాత్రను చేపట్టారు. గత బిజెపి ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై ఎలాంటి చర్యలూ తీసుకోనందుకు నిరసనగా ముఖ్యమంత్రి గెహ్లోట్‌ను టార్గెట్ చేస్తూ అధిష్ఠానం హెచ్చరికలను బేఖాతరు చేస్తూ పైలట్ ఒక రోజు నిరాహర దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు అయిదు రోజుల పాటు జరగనున్న ఈ పాదయాత్ర కూడా ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అధిష్ఠాన వర్గంపై ఒత్తిడి తేవడం కోసమేనని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. యాత్ర ప్రారంభంలో పైలట్ చేసిన వ్యాఖ్యలు కూడా ఇదే విషయాన్ని పరోక్షంగా చెబుతున్నట్లుగా ఉన్నాయి.

మీ వాణిని గట్టిగా వినిపించడానికి, మీ గొంతును వినడానికి,ప్రజల గొంతుకను కావడానికి నేను ఈ యాత్ర చేపడుతున్నాను’ అని పాదయాత్ర ప్రారంభానికి ముందు తన అభిమానులనుద్దేశించి పైలట్ అన్నారు. గతంలో గెహ్లోట్ ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రిగా, పిసిసి అధ్యక్షుడిగా ఉండిన పైలట్ 2020లో ముఖ్యమంత్రిపై తిరుగుబాటు చేయడంతో పదవులనుంచి తొలగించిన విషయం తెలిసిందే. మండిపోతున్న ఎండలను పైలట్ ప్రస్తావిస్తూ, ఇది అగ్ని నది అని, దీన్ని మనం అధిగమించాల్సి ఉంటుందన్నారు.అజ్మీర్‌కు రైల్లో వచ్చిన పైలట్‌కు అభిమానులు ఘన స్వాగతం పలికారు.జైపూర్ హైవేపై అభిమానులనుద్దేశించి ప్రసంగించిన అనంతరం ఆయన పాదయాత్ర మొదలు పెట్టగా వేలాది మంది ఆయన వెంట నడిచారు.

జన సంఘర్ష్‌యాత్ర ’పేరుతో చేపట్టిన ఈ పాదయాత్రలో మాజీ మంత్రి రాజేంద్ర కుమార్, స్థానిక కాంగ్రెస్ నేత మహేంద్ర రల్వాతా కూడా పాల్గొన్నారు. అయితే అసమ్మతి నేతగా పేరుబడ్డ అజ్మీర్ ఎంఎల్‌ఎ మాత్రం యాత్రకు దూరంగా ఉండడం గమనార్హం. పైలట్ తన యాత్రలో ముఖ్యంగా గత బిజెపి ప్రభుత్వంలో జరిగిన అవినీతితో పాటుగా గెహ్లోట్ హయాంలో జరిగిన ప్రభుత్వ రిక్రూట్‌మెంట్ పరీక్షల్లో జరిగిన పేపర్ లీక్స్‌కు సంబంధించిన అంశాలను ప్రస్తావించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News